న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను సెలెక్టర్లు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంజీ ట్రోఫీలో సెంచరీల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సిందని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. కానీ సెలెక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్కు బదులు టీ20ల్లో సత్తా చాటుతున్న సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు.
ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడిన ప్రతీ మాట చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఓ చానెల్తో సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, జట్టులోకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడని తెలిపాడు.
'సూర్య టెస్టు జట్టులోకి రావడం.. టీ20ల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం నాకు స్ఫూర్తినిచ్చేదే. అతను నా బెస్ట్ ఫ్రెండ్. ముంబై తరఫున ఆడుతున్నప్పుడు చాలా సమయం గడుపుతాం. నేను సూర్య నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సూర్య కూడా జాతీయ జట్టులోకి రావడానికి చాలా కాలం వేచి చూశాడు.
రంజీల్లో తన అనుభవాన్ని టీ20ల్లో చూపెడుతున్నాడు. ఆ విధంగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.' అని అన్నాడు. సర్ఫరాజ్ మాదిరిగానే జాతీయ జట్టులోకి రావడానికి సూర్య చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ జాతీయ జట్టులోకి వచ్చాక అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
ఇక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి తాను ఎంపిక కాకపోవడం పై సర్ఫరాజ్ స్పందిస్తూ.. 'ప్రతీ మ్యాచ్ కు ముందు నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే.. ఏదేమైనా నేను పరుగులు చేయాలి. అది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీనా, విజయ్ హజారేనా, రంజీ ట్రోఫీనా అన్నది అనవసరం. నేను నా ఆటను ఆస్వాదిస్తా. నా దృష్టి ఎప్పుడూ స్కోర్లు చేయడం మీదే ఉంటుంది.
ఇక సెలక్షన్ అనేది నా చేతుల్లో లేని విషయం. దాని గురించి నేను పట్టించుకోను. అసలు దాని గురించి ఆలోచించను కూడా.' అని కుండబద్దలు కొట్టాడు. గత రంజీ సీజన్ లో 982 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత సీజన్లో ఆరు మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్ల్లో 556 రన్స్ చేశాడు. గత 23 ఇన్నింగ్స్ల్లో సర్ఫరాజ్ 10 సెంచరీలు చేయడం విశేషం.