ఇప్పటికీ వివక్ష ఎదురవుతున్నా..
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు భారత్లో క్రీడాకారిణులకు ఎంతో ఆదరణ లభిస్తోందని.. అయితే, క్రీడల్లో మహిళలు మరింత ముందంజ వేయాల్సిన అవసరముందని ఆరు గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత సానియా వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికీ సమాజంలో మహిళలకు వివక్ష, అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పింది. ‘క్రికెట్ను మినహాయిస్తే మిగతా క్రీడల్లోనూ ఈ రోజు మహిళా అథ్లెట్లు పెద్ద స్టార్లుగా ఉన్నారు. మేరీకోమ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, వినేశ్ ఫొగట్, మీరాబాయి చాను.. వీళ్లంతా ఇప్పుడు భారత క్రీడారంగంలో సూపర్స్టార్లు. ఇది చాలా గర్వపడే అంశం. ఎవరు కాదన్నా..అందులో నా పాత్ర కూడా ఉంది.
ఎంత కష్టమో నాకు తెలుసు..
న్యూస్ పేపర్లు, మ్యాగజైన్, బిల్ బోర్డ్స్లో క్రీడాకారుణులు కనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ మహిళ.. స్పోర్ట్స్ పర్సన్గా ఉండాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అనేదానికి ఇవన్నీ నిదర్శనం. కానీ చివరి మెట్టును అందుకోవడానికి మాత్రం మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది. ఒక బాలిక తనకు తానుగా బాక్సింగ్ గ్లౌవ్స్ వేసుకోవాలి. ఓ అమ్మాయి ఇష్టంతో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాలి. నేను రెజ్లర్ అవుతానని మరో అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి. ఇవన్నీ సర్వ సాధారణంగా జరిగిపోవాలి. మహిళలు స్వతంత్రంగా స్పోర్ట్స్ కెరీర్ను ఎంచుకునే స్థాయికి ఎదగాలి. ఇందులో పురోగతి సాధించినప్పుడే మనం తుది మెట్టును అందుకుంటాం.
పెళ్లెప్పుడు.. పిల్లలెప్పుడూ..
టెన్నిస్లో నేను ఎంతో సాధించినా, పెళ్లెప్పుడు చేసుకుంటావని, తల్లివి కాకపోతే జీవితం పరిపూర్ణమవదనే భావనతో మాట్లాడేవారు. ఇలాంటి మాటలు మన ఆశయాలు, లక్ష్యాలను చంపేస్తుంటాయి. అయినా, నా తల్లిదండ్రుల సహకారంతో అన్ని సవాళ్లను అధిగమించి కెరీర్లో విజయవంతంగా ముందుకెళ్లా. ఇక అమ్మాయిల కోచింగ్ విషయంలోనూ కోచ్లు మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించింది. 13-14 ఏళ్ల వయసులో అమ్మాయిలు తమని తాము తెలుసుకుంటారు. శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అందువల్ల యువ ఆటగాళ్లను కోచ్లు ఒత్తిడికి గురిచేయకూడదు.ఇక తనలోని పోటీపడే తత్వమే.. తన సక్సెస్ సీక్రెట్.'అని సానియా తెలిపింది.