హైదరాబాద్: ధోనీ చేయకనే చేసిన సాయమిది. అతనిపై క్రేజ్ ఉన్న వాళ్ల నుంచి క్యాన్సర్ రోగుల కోసం నిధుల కేటాయించాలనే సద్బుద్ధికి నిదర్శనమిది. తమ అభిమాన క్రికెటర్లు ధరించిన జెర్సీలు, వారు వాడే బ్యాట్లు, హెల్మెట్, గ్లౌజులను దక్కించుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. దాని కోసం తమ శక్తి మేర ఖర్చు పెడతారు. ఆ ఆనందంలో భాగమవడం ఇప్పుడు ధోనీ అభిమానుల వంతైంది.
ధోనీ ధరించిన జెర్సీతో పాటు మరికొన్ని వస్తువులను సాల్ట్ స్కాట్ సంస్థ నిర్వాహకులు వేలానికి అందుబాటులో ఉంచారు. ఆ వేలం ఆగస్టు 9 వరకు జరగనుండటంతో ఔత్సాహికులు, ధోనీ అభిమానులు కొనుగోలు జరిపేందుకై పోటీ పడుతున్నారు. .
అసలు ఆ కవచం ఏంటి?
ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ స్నీకర్స్ చాక్లెట్ యాడ్లో పోరాట యోధుడిగా కనిపించి సందడి చేసిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది కదా! ఆ యాడ్లో ధోనీ ధరించిన ఏడో నంబర్ పసుపు రంగు జెర్సీతో పాటు పోరాట యోధుడి వేషంలో ధరించిన వస్త్రాలను వేలంలో ఉంచారు. పోరాట యోధుడి డ్రస్పై ధోనీ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఆగస్టు 9వరకు ఈ వేలం జరగనుంది. ప్రస్తుతం రూ.22,000 వద్ద వేలం కొనసాగుతోంది.
ఎవరికి అందుతుందంటే:
ఈ వేలం ద్వారా వచ్చిన నగదును క్యాన్సర్ బాధితులకు ఉపయోగించనున్నట్లు లుకేమియా లింఫోమా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్ బాధిత కుటుంబసభ్యులు ఎవరికైతే వార్షిక వేతనం రూ.30వేల కంటే తక్కువగా ఉంటుందో వారి చికిత్సకే వేలం ద్వారా వచ్చే డబ్బును వినయోగించనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.