ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు.. ఎవర్నీ నిందించలేం: అక్షర్ పటేల్
అసలు ఏం జరిగిందో తనకే అర్థం కావడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఈ ఘోర ఓటమికి ఎవర్నీ నిందించలేనని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. ఈ పరాజయాన్ని వీలైనంత త్వరగా మరిచిపోయి ముందుకు సాగుతామని చెప్పాడు. 'ఈ మ్యాచ్లో ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు. కానీ క్రికెట్లో ప్రతిరోజూ అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత త్వరగా ఈ పరాజయాన్ని మరిచి ముందకు సాగాలి.
ఐపీఎల్ కఠినమైన టోర్నీ..
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మూమెంటమ్ దెబ్బతిన్నదా?అంటే అవుననే అంటాను. అయితే క్రికెట్లో ఇలా జరిగితే బాగుండు, అలా జరగకపోతే బాగుండని అనిపిస్తుంది. కానీ క్రికెట్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం కీలకం. ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నీ. ఏ రోజూ కూడా విజయం అంత సులువుగా లభించదు. ప్రతీ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. మూమెంటమ్ ముఖ్యం.

కానీ అలా జరిగి ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ కూర్చోలేం. మన ముందున్న దానిపై ఫోకస్ పెట్టడం కీలకం. ఈ మ్యాచ్ను వీలైనంత త్వరగా మరిచి ముందకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతికూల ఆలోచనలతో ఉంటే మ్యాచ్లు ఓడిపోతాం. సానుకూలంగా ఉంటేనే మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. కాబట్టి ఈ ఫలితాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లాలి. మా జట్టుకు కూడా ఇదే చెబుతాను. ఒక చెడ్డ మ్యాచ్ ఆడినంత మాత్రాన బ్యాటర్లను వేలెత్తి చూపడం సరికాదు. సానుకూలంగా ఉంటూ గత 6-7 మ్యాచ్ల్లో ఏం చేశామో దాన్నే కొనసాగించాలి. 'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
నిప్పులు చెరిగిన భువీ, హేజిల్వుడ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.
అర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications