ముంబై: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు లేరు. భారత్ లో క్రికెట్ ఒక మతమైతే, సచిన్ టెండూల్కర్ దేవుడుతో సమానం. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తనదైన ఆటతో క్రికెట్కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా తనే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు.
మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు చేశాడు. మరెన్నో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. అయితే ఇంత సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్ కెరీర్లో రెండు విషయాల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయిందట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
'నా జీవితంలో రెండు విషయాలు కలగానే మిగిలిపోయాయి. మొదటిది.. చిన్నతనం నుంచి సునీల్ గవాస్కర్ నా బ్యాటింగ్ హీరో. ఆయనతో కలిసి ఆడలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆయన రిటైర్ అయిన రెండేళ్లకు నేను క్రికెట్లోకి అరంగేట్రం చేశాను. రెండోది.. సర్ వివియన్ రిచర్డ్స్ నా చిన్ననాటి హీరో. ఆయనతో కలిసి కౌంటీ క్రికెట్లో ఆడటం నా అదృష్టంగా భావిస్తాను. కానీ.. నేను అరంగేట్రం చేసిన తర్వాత ఆయన రిటైర్ అయినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రం ఆయనకు ప్రత్యర్థిగా ఆడలేకపోయాను.'అని సచిన్ చెప్పుకొచ్చాడు.
2013లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సచిన్.. కెరీర్లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 51 శతకాలతో 15,921 పరుగులు చేశాడు. అలాగే ప్రపంచకప్లో మొత్తం 2,278 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.