గంగూలీతో మధురస్మృతులు:
సచిన్, గంగూలీ భారత జట్టుకు ఎంపికవ్వకముందే అండర్-15 స్థాయిలోనే కలిసి ఆడారు. దీంతో వారిద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఉండేది. కాలం గడుస్తున్నా కొద్దీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం, ఆప్యాయత పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో అందరూ తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాతో తనకున్న ఓ మధురస్మృతులను లిటిల్ మాస్టర్ అభిమానులతో పంచుకున్నాడు.
దాదీ ఇంట్లో గడిపిన సంతోషకరమైన సాయంత్రం:
సచిన్-గంగూలీ టీమిండియా తరఫున ఆడుతున్న రోజుల్లో ఓసారి దాదా ఇంటికి లిటిల్ మాస్టర్ వెళ్లాడు. ఈ సందర్భంగా గంగూలీ తల్లి నిరూపా గంగూలీ.. సచిన్కు ఇష్టమైన వంటకాలు పెట్టింది. ఆనాటి ఫొటోను సచిన్ తాజాగా అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. 'దాదీ ఇంట్లో గడిపిన సంతోషకరమైన సాయంత్రం, గతస్మృతులు' అని సచిన్ కాప్షన్ రాసుకొచ్చాడు. నాటి ఆతిథ్యం చాలా బాగుందన్నాడు. ఈ సందర్భంగా గంగూలీ తల్లిని గుర్తుచేసుకున్న సచిన్.. ఆమె బాగున్నారని ఆశిస్తూ శుభాకాంక్షలు చెప్పాడు.
ఈ నిబంధనలు అప్పుడు ఉండుంటేనా:
సచిన్-గంగూలీ 176 వన్డేల్లో భారత జట్టుకు కలిసి ఆడారు. ఈ జోడీ తమ భాగస్వామ్యంలో 47.55 సగటుతో 8,227 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యాలను కీర్తిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ఓ ట్వీట్ చేసింది. 176 వన్డేల్లో 8,227 పరుగులు జోడించారంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఐసీసీ చేసిన ట్వీట్పై సచిన్ స్పందించాడు. 'ఇది మన అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేసింది. నలుగురు ఫీల్డర్లు మాత్రమే రింగ్ బయట ఉండాలని, రెండు కొత్త బంతుల నిబంధనలు అప్పుడు ఉంటే మరెన్ని పరుగులు చేసేవాళ్లమని అనుకుంటున్నావు?' అని ట్వీట్ ద్వారా గంగూలీని అడిగాడు.
మరో 4వేల పరుగులు చేసేవాళ్లం
సచిన్ టెండూల్కర్ ట్వీట్పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'మరో నాలుగు వేల పరుగులు, అంతకన్నా ఎక్కువ చేసేవాళ్లం. రెండు కొత్త బంతులంటే.. మ్యాచ్ తొలి ఓవర్తో పాటు మిగిలిన 50 ఓవర్లలో కవర్డ్రైవ్తో బౌండరీలు బాదినంత బాగుంటుంది' అని దాదా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో ఒక్కో ఎండ్ నుంచి ఒక్కో కొత్త బంతిని బౌలర్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆటలో మరే జంట కూడా వన్డేల్లో కనీసం 6 వేల పరుగులు చేయలేదు.