
హైదరాబాద్: సామాజిక మాద్యమాల్లో సాధారణ మనుషుల దగ్గర్నుంచి, సెలబ్రిటీల వరకూ తమ భావాలను ఇట్టే పంచేసుకుంటున్నారు. ఒకప్పటి కాలంతో పోల్చుకుంటే చాలా వేగంగా తమ అభిమానులతో విషయాలను పంచుకోవడానికి ఈ మాద్యమాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకరోజు పురస్కరించుకుని భావాలను పంచుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న ట్విట్టర్, ఫేస్బుక్లు, ప్రముఖుల కార్యకలాపాలను తెలుసుకోవడంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
జూన్ 17 ఫాదర్స్ డే పురస్కరించుకుని ఆదివారం సీనియర్ క్రికెటర్లతో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా తన తండ్రితో ఉన్న ఫోటోను ఉంచి భావాన్ని ఇలా వ్యక్తపరిచాడు. ఇక సచిన్ కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ.. అలనాటి పాత ఫొటోను పోస్టు చేశాడు. ఆ ఫొటోను ఉంచి 'నా మొదటి హీరో, నా చిరకాల ప్రోత్సాహం, నా తండ్రి' అని పోస్టు చేశాడు.
ఈ నేపథ్యంలో ప్రతి విషయానికి ఎప్పుడూ ప్రత్యేక ధోరణిలో స్పందించే గౌతం గంభీర్ ఫాదర్స్ డే సందర్భంగా కూడా అలానే స్పందించాడు. తన ట్వీట్ ద్వారా తండ్రులకు శుభాకాంక్షలు చెప్పాడు. అది మగవాళ్లకు కాదు. మహిళలకు.. 'ఈ తండ్రులు షేవ్ చేసుకుంటారు గడ్డానికి కాదు, కాళ్లకు. లిప్ స్టిక్, హీల్స్ వేసుకుని పని చేసేందుకు బయల్దేరిపోతారు.' అని ఒంటరిగా కుటుంబం కోసం పోరాడే మహిళలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన దివంగత తండ్రితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'చిన్నప్పటి నుంచే కష్టపడడం నేర్పించారు. ఎవరి సాయం కోసమో చూడకుండా నేను చేసే పనిలో నాకు ఎనలేని విశ్వాసం కలిగి ఉం డేలా చూశారు. ఆ పాఠమే ఇప్పుడు నా జీవిత సారాంశం. నన్ను సరైన మార్గంలో నడిపించిన మా నాన్నకు కృతజ్ఞతలు' అని ఫొటోపై రాసి ఉంది. అలాగే, 'ఈ ఫాదర్స్ డే రోజు గుర్తుండిపోయే పని చేయండి. అది మీ తండ్రికి ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉండాలి' అంటూ ఫ్యాన్స్కు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.
ఇక ధావన్ తన తండ్రి ఫొటోను పిల్లల ఫొటోను కలిపి పోస్టు చేసి.. థ్యాంక్యూ పాపా.. మీరెప్పుడూ నాతో ఉన్నారు. అప్పుడు మీరు నేర్పిన కొన్ని విషయాల్లో నవ్వొచ్చేది. కానీ, ఇప్పుడు నేను కూడా నా పిల్లలకు అవే నేర్పుతున్నా. హ్యాపీ ఫాదర్స్ డే' అని పేర్కొన్నాడు.