
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకి ఎంపిక చేసే సమయంలో వయసు కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు లార్డ్స్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత్తో తలపడే జట్టుని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించిన జట్టులో ఇద్దరు యువ క్రికెటర్లు శామ్ కుర్రన్, అలీ పోప్ చోటు దక్కించుకున్నారు. దీనిపై సచిన్ టెండూల్కర్ని ప్రశ్నించగా...
"క్రికెటర్లో ప్రతిభ ఉంటే.. వయసుని పరిగణలోకి తీసుకోకుండా అతడ్ని దేశం తరఫున ఆడించాలి. నేను తొలి మ్యాచ్ ఆడినప్పుడు నా వయసు 16 మాత్రమే. ఆ సమయంలో సెలక్టర్లు కేవలం నా ప్రతిభని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు" అని సచిన్ వెల్లడించాడు.
"అప్పట్లో పాక్ పేసర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్లను ఎలా ఎదుర్కోవాలో? నాకు తెలీదు. ఇక్కడ కూడా అంతే.. కుర్రన్, పోప్ల వయసుని చూడకండి. వారికి భారత్తో టెస్టు సిరీస్ రూపంలో కఠిన సవాల్ ఎదురుకానుంది. అయితే, వాటిని అధిగమించి రాణించాలి" అని సచిన్ అన్నాడు.
యువకుడిగా ఉన్నప్పుడు దూకుడుగా, నిర్భయంగా ఆడతారని ఒకసారి అనుభవం, పరిణతి వస్తే ఆట మరోలా ఉంటుందని తెందుల్కర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ను పోప్, కర్రన్ ఆస్వాదించాలని సూచించారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆడిన 20 ఏళ్ల శామ్ కుర్రన్ని రెండో టెస్టులోకి ఎంపిక చేసిన ఇంగ్లాండ్ సెలక్టర్లు.. అతడితో పాటు పోప్ని కూడా జట్టులోకి తీసుకున్నారు.
20 ఏళ్ల పోప్కి లార్డ్స్ వేదికగా గురువారం జరగనున్న టెస్టు తొలి టెస్టు కానుంది. ఇదిలా ఉంటే, సోమవారం నార్త్వుడ్లోని మర్చంట్ టైలర్స్వుడ్ పాఠశాలలోటెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్అకాడమీ(టీఎంజీఏ)పేరుతో కొత్త అకాడమీని సచిన్ ప్రారంభించాడు. ఈ అకాడమీ పేరు టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీ(టీఎమ్జీఏ).
ఆగస్టు9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు సచిన్ క్రికెట్ పాఠాలు చెప్పనున్నాడు. త్వరలోనే ముంబై, లండన్లో కూడా ఈ అకాడమీలు ప్రారంభించనున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా పలు క్యాంపులు కూడా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సచినే స్వయంగా క్లాసులు చెప్పనున్నాడు.
అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా మర్చంట్ టైలర్స్వుడ్ పాఠశాల విద్యార్థులతో సచిన్ స్వయంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా విద్యార్ధులడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మిడిలెక్స్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.