అలా ఆడటంతోనే 6 విజయాలు..
'ప్రణాళికలకు తగ్గట్లు రాణించడం వన్డే క్రికెట్లో చాలా ముఖ్యం. మేం మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే గత 6 మ్యాచ్ల్లో విజయం సాధించాం. నిలకడగా రాణించడం కూడా మా విజయాలకు కలిసొచ్చింది. సిరాజ్, షమీ లేకుండా బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. చాహల్, ఉమ్రాన్ మాలిక్లను తుది జట్టులోకి తీసుకొని తీవ్ర ఒత్తిడిలో ఎలా రాణిస్తారోనని పరీక్షించాలనుకున్నాం. బోర్డుపై పరుగులున్నా.. ఈ వికెట్పై ఎంత పెద్ద లక్ష్యమైనా సరిపోదనే విషయం నాకు తెలుసు.
కుల్దీప్, శుభ్మన్ సూపరో సూపర్..
మేం ప్రణాళికలకు కట్టుబడి రాణించి విజయాన్నందుకున్నాం. చాలా రోజులుగా శార్దూల్ సత్తా చాటుతున్నాడు. జట్టులో అతన్ని అందరూ మెజిషియన్ అంటారు. అవసరమైనప్పుడల్లా బ్యాట్, బంతితో మెరుస్తాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుల్దీప్ యాదవ్కు బంతిని అందించినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. జట్టుకు కావాల్సిన వికెట్లు తీసి బ్రేక్త్రూ అందిస్తున్నాడు. మణికట్టు స్పిన్నర్లు గేమ్ టైమ్తో మెరుగవుతారు.
ప్రతీ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అప్రోచ్ ఒకేలా ఉంటుంది. ప్రతీ మ్యాచ్ను కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. జట్టులోకి వచ్చిన ఓ యువకుడు అలాంటి వైఖరి కలిగి ఉండటం గొప్ప విషయం.
సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది..
నేను సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. గత కొంత కాలంగా రాణిస్తున్న నాకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ర్యాంకింగ్స్ను మేం పెద్దగా పట్టించుకోం. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తాం. ఆస్ట్రేలియా నాణ్యమైన జట్టు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ టీమ్పై గెలవడం అంత సులువైన పని కాదు. కానీ మేం పై చేయి సాధిస్తామని నమ్మకం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఓపెనర్ల విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 101), శుభ్మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లతో 113) సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్లతో 138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరొక వికెట్ తీసారు.