న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడమే తన కెరీర్లో తీవ్రంగా బాధపెట్టిన విషయమని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నీలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో ఈ క్వారంటైన్ సమయాన్ని గడుపుతూ సోషల్ మీడియా వేదకగా మహమ్మారి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరదాగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా హిట్మ్యాన్తో లైవ్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పీటర్సన్.. కెరీర్లో ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏంటని రోహిత్ను ప్రశ్నించాడు. దీనికి 2011 ప్రపంచకప్ జట్టులో చోటుదక్కపోవడమే తన కెరీర్లో అత్యంతగా బాధపెట్టిన విషయమని రోహిత్ చెప్పుకొచ్చాడు. 'సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం నా కెరీర్లోనే తీవ్రంగా బాధపడిన సందర్భం... పైగా ఈ మెగాటోర్నీ ఫైనల్ మా ముంబైలో నా సొంత మైదానంలోనే జరిగింది.'అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు.
పరిస్థితులు సర్దుకుంటే ఐపీఎల్ జరగొచ్చు: రోహిత్ శర్మ
ఇక ఎందుకు ఎంపికవ్వలేదని పీటర్సన్ ప్రశ్నించగా.. తన తప్పిదాలు, నిలకడలేమి ఫామే కారణమన్నాడు. 'నా చెత్త ప్రదర్శన కారణంగానే జట్టులోకి ఎంపికవ్వలేదు.' అని తెలిపాడు.
ఇక ఈ ప్రపంచకప్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయాన్నందుకున్న ధోనీ సేన 28 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఈ ప్రపంచకప్ అనంతరం జట్టులోకి వచ్చిన రోహిత్ రెగ్యూలర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో 5 సెంచరీలతో మెరిసిన హిట్మ్యాన్ మెగాటోర్నీ ఈఘనతనందుకున్న తొలి బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. లాంగెస్ట్ ఫార్మాట్లో కూడా ఓపెనర్ బరిలోకి దిగి విజయవంతంగా రాణించాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో అనూహ్యంగా గాయపడి జట్టుకు దూరమైన రోహిత్.. ఐపీఎల్తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ లీగ్ వాయిదాపడటంతో హిట్ మ్యాన్ ఇంటికే పరిమితమయ్యాడు.