న్యూఢిల్లీ: ప్రపంచకప్ గెలవాలంటే ఐపీఎల్కు దూరంగా ఉండాలని టీమిండియా ఆటగాళ్లకు రోహిత్ శర్మ చిన్న నాటి కోచ్ దినేశ్ లాడ్ సూచించాడు. జట్టులోని స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్లు మిస్ కావొద్దని సూచించాడు. టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరకుండా టీమిండియా ఇంటి దారి పట్టడంతో రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లోనైనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యంపై స్పందించిన దినేశ్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓపెనర్లు ఫిక్స్ కాకపోవడంతో గత ఏడు నెలలుగా జట్టులో స్థిరత్వం లేదని, ఓపెనింగ్ బౌలర్లు కూడా మారుతూనే ఉన్నారని దినేశ్ లాడ్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు పనిభారం పేరుతో అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉంటూ ఐపీఎల్ ఆడటం సరికాదన్నాడు. 'పని భారంతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు. అసలు ప్రొఫెషనల్ క్రికెటర్లకు వర్క్లోడ్ సమస్య ఏంటి..? అలాంటప్పుడు మీరు ఐపీఎల్లో ఎందుకు ఆడుతున్నారు? మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఐపీఎల్ ఆడకండి.
అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏ విషయంలోనూ రాజీ పడకూడదు. ఆటగాళ్లు ఐపీఎల్లో కాంట్రాక్టులను వదులుకోవాలా వద్దా? అని నేనెలా చెప్పగలను. దీనిపై వారే నిర్ణయం తీసుకోవాలి. క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేస్తే వారికి ఈ లీగ్లో మంచి జీతం లభిస్తుంది' అని దినేశ్ లాడ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం కూడా చాలా మంది ఐపీఎల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవలేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరీస్ను 1-0తో గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ ఓటమిపాలైంది. ఈ రెండు సిరీస్లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. బంగ్లా టూర్తో ఈ ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరనున్నారు. ఇప్పటికే ఈ పర్యటన కోసం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ ప్రారంభించారు.