

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో అంపైర్ల తప్పిదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్లు తప్పిదాలకు పాల్పడినట్లు ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వెల్లడించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా... మలింగ నోబాల్గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ అంపైర్ ఆ బంతిని నోబాల్గా ప్రకటించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
మ్యాచ్ ముగిశాక రీప్లేలో అంపైర్ల పొరపాటును బిగ్స్క్రీన్పై చూసిన కోహ్లీ.. ప్రజంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ "మేం ఆడేది ఐపీఎల్.. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. అంపైర్లు దీన్ని గమనించాల్సి ఉంది. ఉత్కంఠపోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదు. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు ఏమైనా కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి" అని అన్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ కూడా అంపైర్ తప్పిదాలు మంచివి కాదన్నాడు. బుమ్రా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆఫ్ స్టంప్కి దూరంగా విసిరిన ఓ బంతి లైన్కి లోపలే వెళ్తున్నా.. అంపైర్ వైడ్గా ప్రకటించాడు. దీనిపై బుమ్రా ఆశ్చర్యపోయాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ "చివరి బంతి నోబాల్ అని గ్రౌండ్ దాటి బయటకు రాగానే నాతో ఎవరో చెప్పారు. మ్యాచ్ ఫలితాలు తారుమారయ్యే తప్పిదాలు చేయడం క్రికెట్లో సరికాదు" అని అన్నాడు.
"అంతకుముందు ఓవర్లో కూడా బుమ్రా బంతిని వైడ్గా ప్రకటించారు. అలాంటి తప్పులు మ్యాచ్ ఫలితాల్ని నిర్దేశిస్తాయి. టీవీ అంపైర్లు సరిగ్గా చూడాలి. అక్కడ ఆటగాళ్లు చేసేదేం ఉండదు. అంపైర్లు తమ తప్పులను తెలుసుకుంటారని భావిస్తున్నా" అని అభిప్రాయపడ్డాడు.