న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటలన్నీ స్తంభించిపోయిన వేళ ఇప్పుడిప్పుడే పలు క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య బయోసెక్యూర్ విధానంలో మూడు టెస్టుల సిరీస్ బుధవారం ప్రారంభమైంది. 117 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ పునః ప్రారంభమవడంతో పలువురు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య నిన్న తొలి టెస్టు ఆరంభమవ్వగా ఇంగ్లిష్ జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, విండీస్ పేసర్ షానన్ గాబ్రియల్ రెండో ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లీ(0)ని బౌల్డ్ చేశాడు. దీంతో ఆతిథ్య జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో తొలిరోజు పదేపదే వర్షం అంతరాయం కలిగించడంతో 17.4 ఓవర్ల పాటే ఆట జరిగింది.
బర్న్స్(20), డెన్లీ(14) క్రీజులో ఉన్నారు. కాగా, ఇన్ని రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్గంగూలీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, షేన్వార్న్తో పాటు పలువురు ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా వాళ్లు స్పందించారు. గంగూలీ బుధవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టును చూసి ఆస్వాదిస్తానని తెలిపాడు.
క్రికెట్ మళ్లీ ప్రారంభమైంది. ఇంగ్లండ్లో సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు క్రికెట్ మొదలవ్వడం చూస్తుంటే చాలా బాగుంది. ఇరు జట్లకు అభినందనలు. నేను కూడా అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోతున్నా. -రోహిత్శర్మ
ఇకపై ఏం జరిగినా క్రికెటే విజేత. ఈ వ్యాఖ్య ఇంతకుముందు ఎన్నో సార్లు అని ఉంటారు. కానీ, ఈ రోజు మాత్రం పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. రెండు జట్లకు గుడ్లక్. -అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్ రీస్టార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. -షేన్వార్న్
టెస్టు క్రికెట్ మళ్లీ మొదలవ్వడం ఎంతో బాగుంది. -రికీ పాంటింగ్
117 రోజుల తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ప్రారంభం. 21వ శతాబ్ధంలో ఎక్కువ కాలం ఎదురు చూడటం అంటే ఇదే. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్టుకు వాతావారణం అనుకూలించాలి. - సుబ్రమణ్యం బద్రీనాథ్.