
హైదరాబాద్: ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ లైక్ చేయడం ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతోంది. వివరాల్లోకి వెళితే... సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా తొలి మూడు టెస్టుల వరకు భార్యలు, గర్ల్ ప్రెండ్స్కు అనుమతి లేదని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బోర్డు మినహాయింపు ఇచ్చినట్లు ఉంది.
లేక బోర్డు నిబంధల్ని అతిక్రమించాడా? ఎందుకంటే లార్డ్స్ టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియాతో కలిసి అనుష్క శర్మ భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటో బయటకు రావడంతో పలు విమర్శలకు కారణమైంది.
దీంతో బీసీసీఐ ఒక్కో ఆటగాడిపట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నదంటూ ఓ క్రికె ట్ అభిమాని చేసిన ట్వీట్ను రోహిత్ శర్మ లైక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ "మూడో టెస్టు వరకూ భార్యలు, గాళ్ఫ్రెండ్స్కు అనుమతిలేదు. దీనిపై బీసీసీఐ ద్వంద్వ విధానాలు అనుసరిస్తోంది" అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. తాజాగా, లార్డ్స్ టెస్టుకు ముందు భారత హైకమిషనర్ ఇచ్చిన విందుకు టీమిండియాతో పాటు అనుష్క శర్మ హాజరైంది.
భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్, సహాయ సిబ్బంది ఈ విందుకి హాజరవగా.. కెప్టెన్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లింది. అయితే ఫొటో తీసుకునే సమయంలో కోహ్లీ, అనుష్క శర్మ మొదటి వరుసలో నిలబడగా.. వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే నాలుగో వరుసలో నిలబడ్డాడు.
దీంతో అభిమానులు టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్ అయ్యారు. అనుష్క శర్మకి ఇచ్చిన గౌరవం కూడా భారత్ జట్టు వైస్ కెప్టెన్కి ఇవ్వరా? అని తీవ్ర విమర్శలు గుప్పించారు. "అనుష్క ఏమన్నా టీమిండియా వైస్ కెప్టెనా? జట్టులో ఆమె ఎందుకు ఉంది?" అంటూ కామెంట్లు కూడా చేశారు.
తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. క్రికెటర్లు ఇష్టపూర్వకంగానే వారి బంధువులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారని పేర్కొంది. భారత హైకమిషన్.. క్రికెటర్లను, వారి బంధువులను ఆహ్వానించిందని, ఫొటో దిగే సమయంలో ఆటగాళ్లు ప్రొటోకాల్ను అతిక్రమించలేదని పేర్కొంది.
"క్రికెటర్లు ఎవరితోనైనా ఫొటోలు దిగొచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. లండన్లో జరిగే మ్యాచ్లకు ఆటగాళ్లు వారి బంధువులతో హాజరుకావచ్చు. రిసెప్షన్ నిమిత్తం హై కమిషనర్, ఆయన సతీమణి ఆహ్వానిస్తేనే అనుష్క వేడుకకు హాజరయ్యారు. హై కమిషనర్ అధికారిక నివాసంలోకి ప్రవేశించబోతున్న సమయంలో ఈ ఫొటో తీశారు. ఇక, రహానే విషయానికొస్తే అతను ఇష్టప్రకారమే వెళ్లి వెనక నిలబడ్డాడు" అని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.