న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నర్ రోజర్ బిన్నీ ఎంపికయ్యాడు. మంగళవారం ముంబైలోని తాజ్ హోటల్లో ముగిసిన సమావేశం తర్వాత బీసీసీఐ.. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి మరొకరు పోటీ చేయకపోవడంతో రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రోజర్ బిన్నీ.. మీడియాతో మాట్లాడారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన తన ముందు రెండు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని తెలిపాడు.
తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాక ఆ రెండు విషయాల మీద దృష్టి సారిస్తానని తెలిపాడు. బిన్నీ మాట్లాడుతూ.. 'బీసీసీఐ అధ్యక్షుడిగా నేను రెండు కీలక విషయాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందులో ఒకటి ఆటగాళ్ల గాయాలు. గాయాలను నివారించడం నా మొదటి ప్రాధాన్యత. ప్రపంచకప్ కు ముందు జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో భారత జట్టు మొత్తం ప్రణాళికనే ఇది ప్రభావం చేసింది. రెండోది, దేశంలోని పిచ్ ల మీద నేను దృష్టాసారిస్తా.' అని తెలిపాడు.
బిన్నీ చెప్పినట్టు గత కొంతకాలంగా భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ తదితర ఆటగాళ్లంతా కీలక సిరీస్లకు ముందు గాయాల పాలయ్యారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూర్చుని మాట్లాడాలని.. సదరు ఆటగాడు జాతీయ జట్టుకు ఎంత అవసరమనేది ఫ్రాంచైజీలకు వివరించి అతడికి విశ్రాంతినిచ్చేలా ప్రణాళికలు రచిస్తే గాయాల బెడద నుంచి తప్పించుకోవచ్చునని సూచించాడు.