
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్లుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వికెట్ కీపర్ రిషభ్ పంత్ నడపించనున్నాడు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజ గాయంతో ఈ సీజన్కు దూరమైన నేపథ్యంలో రిషభ్ పంత్ను కెప్టెన్గా నియమిస్తున్నట్లు తెలిపింది. సీనియర్లు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్లను కాదని.. పంత్కు సారథ్యం అప్పజెప్పింది.
అయితే రిషభ్ పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరూ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరూ తప్పుబడుతున్నారు. ఇప్పుడిప్పుడే పంత్ తానెంటో నిరూపించుకుంటున్నాడని, అతనిపై కెప్టెన్సీ అనవసర ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి పంత్ రఫ్ఫాడిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో మూడు సిరీస్ల్లోనూ అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా సిరీస్ నుంచి అతను తప్పుకున్నాడు. అయితే అయ్యర్కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని డాక్టర్లు తాజాగా తెలిపారు.
ఏప్రిల్ 8న అయ్యర్ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నెలల పట్టే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు. దాంతో అతను ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక అయ్యర్ సేవలను కోల్పోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ విచారం వ్యక్తం చేసింది. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.