మాటలు రావడం లేదు..
'నా ఈ బాధను వర్ణించడానికి మాటల్లేవు. విజయం సాధిస్తామని ఆఖరి క్షణం వరకు నమ్మకంతోనే ఉన్నాం. వీలైనంతవరకు గేమ్ను చివరి వరకు తీసుకెళ్లాళనుకున్నాం. బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. అయితే కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పవర్ ప్లే ముగిసిన తర్వాత కట్టడి చేశారు. మిడిల్ ఓవర్లలో పరుగులు చేయలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయలేకపోయాం. ఈ ఏడాది అద్భుతంగా రాణించాం. ఒకరికొకరం అండగా నిలుస్తూ రాణించడం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వచ్చే ఏడాది మరింత బలంగా తయారై మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాం'అని పంత్ చెప్పుకొచ్చాడు.
కన్నీటి పర్యంతం..
ఈ ఓటమిని తట్టుకోలేక పంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఓపెనర్ పృథ్వీ షా సైతం ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చినా టైటిల్ అందుకోకపోవడం పట్ల ఢిల్లీ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అభిమానులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ లక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 2019 సీజన్లో మూడో ప్లేస్లో నిలిచిన ఢిల్లీ.. గతేడాది ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని బరిలోకి దిగింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించింది. కానీ కీలక క్వాలిఫయర్ మ్యాచ్ల్లో ఓడి ఉత్త చేతులతో ఇంటిదారి పట్టింది.
చెలరేగిన వెంకీ..
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి ఓ బంతి మిగిలుండగానే గెలుపొందింది. వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా..శుభ్మన్ గిల్ (46 బంతుల్లో ఫోర్, సిక్స్తో 4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
త్రిపాఠి సూపర్ సిక్స్..
ఓపెనర్లిద్దరు తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఓ దశలో కేకేఆర్ సునాయసంగా గెలుస్తుందనిపించింది. కానీ రబడా వేసిన 18వ ఓవర్లో ఓ వికెట్ తీసి 1 పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో కేకేఆర్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్లో మూడు పరుగులిచ్చే ఓ వికెట్ తీయడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లీంది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. దాంతో చివరి రెండు బంతులకు కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.