అగ్రస్థానంలో కేన్:
సిడ్నీ టెస్టులో 131, 81 పరుగులతో సత్తాచాటిన ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (900) తన ర్యాంక్ను మెరుగుపర్చుకుని.. రెండో స్థానంలో నిలిచాడు. పితృత్వ సెలవులపై స్వదేశానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంక్ను కోల్పోయి.. మూడో స్థానంలో (870) ఉన్నాడు. ఇక పాకిస్థాన్ సిరీస్లో పరుగుల వరద పారించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (919) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాదిని విలియమ్సన్ అగ్రస్థానంతో ముగించిన విషయం తెలిసిందే.
పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి:
సిడ్నీ టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నాడు. రెండు అర్ధ శతకాలు సాధించిన పుజారా రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ఒక స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్లో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులు సాధించిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 97 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ర్యాంక్ మెరుగుపర్చుకున్న విహారి:
కంగారూల విజయానికి చెక్ పెట్టిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కూడా తమ ర్యాంక్లు మెరుగుపర్చుకున్నారు. విహారి 52వ స్థానంలో, అశ్విన్ 89వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా బౌలర్లు అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలు 9, 10వ స్థానాల్లో నిలిచారు. పాక్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ కైల్ జేమిస్ 5 స్థానాలు ఎగబాకి టాప్ 5లో చోటు సంపాదించాడు.
జడేజా2:
ఆల్రౌండ్ విభాగంలో రవీంద్ర జడేజా 428 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ టాప్ ప్లేస్లో నిలిచాడు. ఆసీస్తో జరిగిన మూడో టెస్టులో బొటనవేలి గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్కు దిగలేదు. అయితే జడేజా బొటనవేలికి శస్త్ర చికిత్స పూర్తయినట్లు తాజాగా బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా జడేజా ఆసీస్తో జరిగే నాలుగో టెస్టుతో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లోని తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది.
India vs Australia: సర్జరీ సక్సెస్.. రెట్టించిన బలంతో తిరిగొస్తా: జడేజా