
కరాచీ: కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్ మృతి చెందారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 51 ఏళ్ల రియాజ్ షేక్ మృతికి సంతాపం తెలియజేసిన లతీఫ్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్ధించాలని కోరారు. 1987 నుంచి 2005 వరకూ తన కెరీర్లో రియాజ్ షేక్ 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడారు.
కరాచీలో జన్మించిన లెగ్ స్పిన్నర్ రియాజ్ షేక్ దాదాపు దశాబ్దం పాటు తన కెరీర్ కొనసాగించారు. రిటైర్మెంట్ తర్వాత షేక్.. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో ప్రధాన కోచ్గా చేరారు. ఆయన శిక్షణలో ఎంతో మంది యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యారు. ఆటగాళ్లతో అతడు చాలా మంచిగా ఉండేవారట. గతవారం పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు తన ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.
రియాజ్ షేక్ కంటే ముందు మరో పాకిస్థాన్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలలో ఆయన మృతి చెందారు. కరోనా లక్షణాలతో బాధపడ్డ జాఫర్ సర్ఫరాజ్ (50) పెషావర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనాతో మృతి చెందిన తొలి ఫ్రొఫెషనల్ క్రికెటర్ జాఫరే.
జాఫర్ సర్ఫరాజ్ పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనప్పటికీ.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తనదైన ముద్ర వేశారు. 1988 నుంచి 1994 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 15 మ్యాచుల్లో ఫెషావర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు చేశారు. 1990 నుంచి 1992 వరకు లిస్టు -ఏ క్రికెట్లో 6 వన్డేల్లో 96 పరుగులు చేశారు. 1994లో ఆటకు వీడ్కోలు పలికి కోచ్గా మారారు. 2000 మధ్యలో పెషావర్ సీనియర్, అండర్-19 జట్లకు కోచ్గా పనిచేశారు.