న్యూఢిల్లీ: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)ను కరోనా మహమ్మారి దారుణంగా దెబ్బకొట్టింది. అనేక దేశాల్లో ఆటలు ఆగిపోవడంతో మెగా ఈవెంట్ షెడ్యూల్ దెబ్బతిన్నది. దీంతో కరోనాతో టెస్టు చాంపియన్ ఎవరనేది వచ్చే ఏడాది తేలకపోవచ్చు. వచ్చే ఏడాది జూన్లో లార్డ్స్ వేదికగా జరగాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ అన్నారు.
మహమ్మారి వల్ల పలు దేశాల మధ్య టెస్టు సిరీస్లు జరగకపోవడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. షెడ్యూల్లో మిగిలి ఉన్న టైమ్లో ఎన్ని ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహిస్తామన్నదానిపైనే వచ్చే ఏడాది ఓ నిర్ణయానికి రాగలమన్నాడు. సిరీస్ల రీ షెడ్యూలింగ్పై ఆయా దేశాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 'ఇప్పటికే చాలా సిరీస్లు వాయిదా పడ్డాయి... ముందు ముందు ఇంకెన్ని సిరీస్లపై దీని ప్రభావం వుంటుందో చెప్పలేం. ఏదేమైనా ఈ సిరీస్ల రీషెడ్యూలుపైనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆధారపడింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్లో ఫైనల్ కష్టమే.'అని అలార్డీస్ అన్నారు.