ముంబై ఓడితే ఆర్సీబీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
ముంబైలోని వాంఖడే వేదికగా ఈ రోజు రాత్రి 7.30గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఈ మ్యాచ్ను గెలిచి ఘనంగా ఈ సీజన్ను ముగించాలనుకుంటుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై తప్పకుండా గెలవాలి. ముంబై ఓడితే ఆర్సీబీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం మూడు జట్ల అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీ గెలిస్తే ఏం జరుగుతుందంటే
ప్లేఆఫ్స్కు అర్హత సాధించడానికి ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే 8విజయాలతో 16పాయింట్లు దక్కించుకుంటుంది. ఆర్సీబీకి కూడా 16పాయింట్లు ఉన్నాయి. అయితే ఆర్సీబీతో పోల్చితే ఢిల్లీ నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. అందువల్ల ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ దయాదాక్షిణ్యాలతో ప్లేఆఫ్ చేరుతుంది. ఇక ప్లేఆఫ్లో క్నో సూపర్ జెయింట్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ చేరడం చేరకపోవడం ముంబై చేతిలో ఉండడంతో ఆర్సీబీ అభిమానులు రోహిత్ శర్మ అండ్ టీం ఢిల్లీ కోటను బద్ధలు కొట్టేలా ఆడాలంటూ ఎక్కడ లేని ప్రేమ, మద్దతు ఒలకబోస్తున్నారు.
|
ముంబైని కాక పట్టిన ఆర్సీబీ
ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మ్యాచ్ కు సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఓ పోస్టుకార్డును ముంబై ఇండియన్స్ కు పంపిస్తున్నట్లు ఆర్సీబీ ట్వీట్ చేసి.. అందులో 'హే ముంబై ఇండియన్స్.. మిమ్మల్ని ఆర్సీబీ చీర్ చేస్తుంది. మనం అంతా ఒక ఫ్యామిలీ. ఢిల్లీ క్యాపిటల్స్తో ప్లే బోల్డ్' అంటూ ఆర్సీబీ ముంబైని కాకాపట్టింది. ఇకపోతే ఫ్రాంఛైజీ తన ప్రొఫైల్ పిక్చర్ కూడా బ్లూ బ్యాక్ గ్రౌండ్లోకి మార్చింది. అంటే ముంబై జెర్సీ కలర్ బ్లూ కాబట్టి ఆ విధంగా ముంబైని చీర్ అప్ చేయాలని చూసింది.
నెట్ రన్ రేట్ వల్లే ఆర్సీబీకి ఈ పరిస్థితి
ఆర్సీబీ ప్రస్తుతం ఐపీఎల్ 2022 పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే నెగెటివ్ నెట్ రన్ రేట్ (-0.253) కలిగి ఉంది. అయితే (+0.255) నెట్ రన్ రేట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. 14పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా ఆర్సీబీ 16పాయింట్లతో కొనసాగుతుంది. ఢిల్లీ ఓడిపోతే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా పాయింట్ల ఆధారంగా ఆర్సీబీ ప్లేఆఫ్ చేరుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్పై తన చివరి మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేయడంతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోవడంతో పాటు పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్లను ప్లేఆఫ్ రేసు ఆశలను బుగ్గిపాలు చేసింది.
ఎలిమినేటర్లో ఎవరో మరీ
ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ గేమ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి లీగ్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్లో ఫైనల్లో చోటు కోసం టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ తలపడనుంది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ తేడా వల్ల మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక శనివారం రాత్రి ఢిల్లీ, ముంబై మధ్య జరిగే మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోతో తలపడుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే ఆర్సీబీ ఎలిమినేటర్లో లక్నోతో తలపడుతుంది. ఏదేమైనా నేటి మ్యాచ్ మాత్రం చాలా రవసత్తరంగా జరగడం ఖాయం.