దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మళ్లీ టీమిండియా క్రికెటర్కే దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సత్తా చాటిన టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ సిరీస్లో 32 వికెట్లు తీసిన అశ్విన్ ఒక్క ఫిబ్రవరిలోనే 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ 189 పరుగులు చేసి సత్తా చాటాడు.
అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన రవిచంద్రన్.. ప్లేయర్ ఆఫ్ ది ఫిబ్రవరి అవార్డును సొంతం చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్టులో సెంచరీతో చెలరేగిన అశ్విన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అవార్డు రేసులో రవిచంద్రన్ అశ్విన్తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, వెస్టిండీస్ బ్యాట్స్మన్ కైలీ మేయర్స్ ఉన్నా.. భారత స్పిన్నర్నే వరించింది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన రిషభ్ పంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది జనవరి అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో వరుసగా రెండు అవార్డులు భారత ఆటగాళ్లే దక్కించుకున్నారు.
ఇక మహిళల కేటగిరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇంగ్లండ్ బ్యాట్స్ఉమెన్ బ్యూమంట్ దక్కించుకుంది. ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్లో అద్భుతంగా రాణించింది. 231 పరుగులతో ఆకట్టుకుంది.
24 wickets in February 📈
— ICC (@ICC) March 9, 2021
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది.
షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.