ఆ సమయంలో సిరాజ్ సంబరాలు చూసి ఆశ్చర్యపోయా.. నా బ్యాటింగ్ మెరుగవ్వడానికి కారణం..: అశ్విన్

చెన్నై: సెంచరీ సాధించిన సమయంలో పేసర్ మొహ్మద్ సిరాజ్ సంబరాలు చూసి తాను ఆశ్చర్యపోయానని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఆల్రౌండ్ షోతో సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో అదరగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీ (149 బంతుల్లో 106; 14 ఫోర్లు, ఒక సిక్సర్) బాదాడు. ప్రస్తుతం అశ్విన్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటు, బంతితో ఆంగ్లేయులను ఆటాడిస్తున్న అతడిని ఫాన్స్, మాజీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

థ్యాంక్స్ అనే మాట సరిపోదు
మూడో రోజు మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ... 'ప్రస్తుతం నా ఆలోచన ఒకటే. రేపటికి ఎలా కోలుకుంటానో, రాత్రి ఎలా నిద్ర పడుతుందోనని అనుకుంటున్నా. గత కొన్ని మ్యాచ్ల్లో నా బ్యాటింగ్ మెరుగవ్వడానికి కారణం మాత్రం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. కొత్త టెక్నిక్లతో ఎంతో సాయం చేశాడు. అతడికే ఈ క్రెడిట్ ఇవ్వాలి. సొంత మైదానం (చెన్నై)లో మళ్లీ టెస్టు ఎప్పుడు ఆడతానో తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎంతో ఆనందంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలపడానికి కేవలం థ్యాంక్స్ అనే మాట సరిపోదు' అని అన్నాడు.

సిరాజ్ సంబరాలు చూసి ఆశ్చర్యపోయా
'గతంలో టెస్టుల్లో సెంచరీలు చేసినప్పుడు ఇషాంత్ శర్మ మరో ఎండ్లో ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మొహ్మద్ సిరాజ్ ఉన్నాడు. అతడు క్రీజులోకి రాగానే ఒకటే చెప్పా. బంతి లైన్ను గమనిస్తూ.. బ్యాటింగ్ చేయమని సూచించా. బాగా ఆడాడు. నేను సెంచరీ సాధించినప్పుడు సంతోషంతో సిరాజ్ చేసుకున్న సంబరాలు చూశాక ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. మా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది' అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.
సంతోషంతో బిగ్గరగా అరుస్తూ
ఆర్ అశ్విన్ వ్యక్తిగత స్కోరు 78 వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ (7) క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే చివరి బ్యాట్స్మన్గా వచ్చిన మొహ్మద్ సిరాజ్ అద్భుత డిఫెన్స్తో అశ్విన్ సెంచరీ చేశాడు. 99 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్లో బౌండరీ బాది మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఆ క్షణంలో సిరాజ్ సంతోషంతో బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో సిరాజ్ మంచి మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు.

నాలుగో రోజు ఆటలో యాష్ కీలకం
చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత్ విజయం వైపు దూసుకుపోతోంది. మూడోరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 53/3కు పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 286 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (106) సెంచరీ బాదేశాడు. కష్టంగా ఉన్న పిచ్పై యాష్ సెంచరీ చేయడంతో భారత మాజీ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన యాష్.. రెండో ఇన్నింగ్స్లోనూ 1 వికెట్ పడగొట్టాడు. నాలుగో రోజు ఆటలో యాష్ కీలకం కానున్నాడు.
'అంపైర్ కాల్'తో కోహ్లీ వికెట్ కోల్పోయాడు.. రూట్ బతికిపోయాడు! ఆ నిబంధనను రద్దు చేయండి!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications