ఇక ఎవ్వరూ అలా అనరు
మూడో వన్డే మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ... 'టీమిండియా ఆటగాళ్లు గొప్పగా ఆడారు. ప్రతిఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ముంబైలో ఓడినా.. పటిష్ట ఆస్ట్రేలియాపై మిగతా రెండు మ్యాచ్లలో అద్భుత విజయాలు సాధించాం. టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. బలహీనమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించామని ఇక ఎవ్వరూ అనరు' అని పేర్కొన్నాడు.
రోహిత్-కోహ్లీ గొప్పగా రాణించారు
'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ లక్ష్యం వైపు నడిపించారు. శ్రేయస్ అయ్యర్ కూడా తన సత్తా మరోసారి చాటిచెప్పాడు. శ్రేయస్ ఈ ఇన్నింగ్స్ నుండి చాలా విశ్వాసం పొందుతాడు. భారత బౌలర్లు చివరి పది ఓవర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. యార్కర్లతో బ్యాట్స్మన్ను ఇబ్బంది పెట్టారు. నవదీప్ సైనికి మంచి ప్రతిభ ఉంది. అతడు ఇంకా మెరుగవుతాడు' అని రవిశాస్త్రి అన్నాడు.
బౌలర్లకు అదే ఆయుధం
'130 ఏళ్ల క్రికెట్ చరిత్రలో యార్కర్ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పటికీ వన్డే క్రికెట్లో అదే బ్యాట్స్మన్ను ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి తప్పిదాలు లేకుండా యార్కర్ను సంధిస్తే..ఎంతటి గొప్ప బ్యాట్స్మన్ను అయినా సరే ఔట్ చేయవచ్చు. యువ ఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా వారు అదరగొడతారు. ప్రస్తుత జట్టు సమతుల్యంగా ఉంది. ఆటగాళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తారని ధీమాగా ఉన్నా' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
స్మిత్ సెంచరీ
చిన్నస్వామి స్డేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడవ వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (131) రాణించడంతో తొలుత ఆసీస్ 286 పరుగులు చేసింది. షమీ (4/63), జడేజా (2/44) రాణించారు. అనంతరం రోహిత్ (119), కోహ్లీ (89), శ్రేయస్ (44*) చెలరేగడంతో 47.3 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది.