బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్లో టీమిండియా చేజేతులా విజయవకాశాలను దెబ్బతీసుకుందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయలేకపోయారని విమర్శించాడు. ఇంగ్లండ్పై మూడు రోజులపాటు ఆధిక్యం సాధించిన భారత్ నాలుగో రోజు పట్టువిడిచింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్లో అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయింది.
అంతేకాకుండా బౌలింగ్లోనూ వెనకడుగు వేసింది. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోయి విజయం వైపు దూసుకుపోతున్నారు. చివరి రోజు ఇంకో 119 పరుగులు చేస్తే గెలుపు సొంతం చేసుకోవడంతోపాటు సిరీస్ను సమం చేసే అవకాశం ఇంగ్లండ్ ఎదుట ఉంది.
ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులు సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులకే ఆలౌట్ కావడం, రెండు సెషన్లపాటు బ్యాటింగ్ చేయకపోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడిన రవిశాస్త్రి.. 'భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపర్చింది. పోటీలోనే లేని వారికి (ఇంగ్లండ్) అవకాశం కల్పించారు. నిన్న టీమిండియా కనీసం రెండు సెషన్లపాటు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు. తర్వాత వేగంగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఇంగ్లండ్కు బ్యాటింగ్ చేసేందుకు చాలా సమయం దక్కింది'' అని తెలిపాడు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)