
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో 121 రేటింగ్తో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 120 రేటింగ్తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ (109 రేటింగ్) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్ను కేటాయించింది. ఇందులో భారత్ 24 మ్యాచ్ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్ 18 మ్యాచ్ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. అయితే టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోవడంపై కోచ్ రవిశాస్త్రి సంతోషం చేశాడు.
ట్విటర్ వేదికగా భారత యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ర్యాంకింగ్స్ విషయంలో ఐసీసీ రూల్స్ మార్చినా ఆటగాళ్ల అసమాన పోరాటం వల్లే భారత్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపాడు. 'టీమిండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్ వన్ ర్యాంకును పొందాం. ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్ ఆడారు. జట్టు విజయాల పట్ల, ఈ బిందాస్ ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది.'అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాతో 2-1, ఇంగ్లండ్తో 3-1 తేడాతో సాధించిన సిరీస్ విజయాలు ఇండియాకు కలిసొచ్చాయి.
2017 నుంచి భారత జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్గా సేవలందిస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాతా మరోసారి అతని పదవికాలాన్ని పొడిగించారు. ఇక భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మెగా ఫైనల్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 18-22 వరకు జరగనుంది. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.