
హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన వరుస రెండు టెస్టుల్లో టీమిండియా ఘోర వైఫల్యం చెందింది. ఈ ఓటమి పట్ల ఆటగాళ్ల కంటే కోచ్ రవిశాస్త్రిపైనే ఎక్కువ ఆగ్రహం చూపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. కేవలం అతని నిర్లక్ష్యంపైనే కాకుండా అతను టీమిండియాను చెడగొడుతున్నాడంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో భారత క్రికెట్ జట్టుకు కోచ్గా సేవలందించి ఆటగాళ్ల మధ్య విభేదాలు సృష్టించిన గ్రెగ్ చాపెల్ను గుర్తు చేసుకుంటున్నారు.
చాపెల్ కంటే కూడా రవిశాస్త్రినే మరింత ప్రమాదకారి అంటూ అభివర్ణిస్తున్నారు. కోహ్లీ.. టీమిండియా కోచ్గా అనుభవజ్ఞుడు, నలుగురి చేత గౌరవించబడే కుంబ్లేను కాదనుకున్నాడంటూ.. దానికి తగిన ఫలితమే వచ్చిందని ఎత్తిపొడుస్తున్నారు. ఇలాంటి కోచ్ నేతృత్వంలో ప్రపంచ నంబర్వన్ టీమిండియా విదేశాల్లో గెలవగలదా అని ప్రశ్నిస్తున్నారు. భారత జట్టులో ప్రక్షాళన మొదలుపెడితే అది రవిశాస్త్రితోనే మొదలవ్వాలని, కుంబ్లేను మిస్సయ్యామని మరో అభిమాని ట్వీట్ చేశాడు.
రవిశాస్త్రి కోచ్ కంటే కూడా భారత జట్టు చీర్ లీడర్గా వ్యవహరిస్తున్నాడని మరొక అభిమాని సెటైర్ వేశాడు. పరోక్షంగా కేవలం కోహ్లీకి మాత్రమే ఛీర్ లీడర్గా వ్యవహరిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. ఈ తరహా లక్షణాలు మాజీ కోచ్ అనిల్ కుంబ్లేలో లేవని సదరు అభిమాని ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్లో తిరిగి ఎలా పుంజుకోవాలని ఆటగాళ్లు అడిగిన సందర్భంలో నిద్రపోతే మంచిదనే అర్థం వచ్చేలా రవిశాస్త్రి కునుకు తీస్తున్న ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంచితే కోహ్లీని అభివర్ణిస్తూ.. కోచ్గా.. కెప్టెన్గా.. బెస్ట్ బ్యాట్స్మన్గా వ్యవహరిస్తున్నాడని ట్వీట్ చేశారు మరొకరు. ఇంకా రవిశాస్త్రి కోచ్గా ఏం చేశాడో ఒక్కసారి తెలుసుకోవాలని ఉందని ఒకరు. రవిశాస్త్రికి ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల జీతం ఇస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం అని మరొకరు.