మేం కూడా ఆ టోర్నీ ఆడాం:
భారత్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్ గెలిచి తొమ్మిదేళ్లయిన సందర్భంగా రెండు నెలల క్రితం (ఏప్రిల్ 2) రవిశాస్త్రి ఓ ట్వీట్ చేసాడు. 'జట్టు సభ్యులకు అభినందనలు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులమైన మాలాగే.. 2011 ప్రపంచకప్ నెగ్గిన మీరు ఆ విజయం పట్ల జీవితాంతం ఆనందిస్తూనే ఉంటారు' అని ట్వీట్ చేశాడు. ఆ పోస్టుకు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ల పేర్లను మాత్రమే ట్యాగ్ చేశాడు. ఇది చూసిన యువీ 'ధన్యవాదాలు సీనియర్. మీరు నన్ను, ధోనీని కూడా ట్యాగ్ చేయొచ్చు. మేం కూడా ఆ టోర్నీ ఆడాం' అని రీ ట్వీట్ చేసాడు. దానికి బదులుగా యువరాజ్ ఓ దిగ్గజమని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఎవరినీ ట్యాగ్ చేయలేదు:
భారత్ 1983 ప్రపంచకప్ గెలిచి గురువారానికి (జూన్ 25) 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా యువీ ఓ ట్వీట్ చేసాడు. 'ఈ రోజున మా సీనియర్ల జట్టు 1983 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. దేశానికి గర్వకారణంగా నిలిచిన సందర్భం. ఆ జట్టులోని ప్రతి సభ్యుడికి అభినందనలు. 2011లో అదే ఘనత మేం సాధించేలా మా ముందు లక్ష్యాన్ని నిలిపారు. అన్ని క్రీడల్లో భారత్ ప్రపంచ ఛాంపియన్గా ఎదగాలని కోరుకుంటున్నా' అని యువీ ట్వీట్ చేశాడు. అయితే అప్పటి జట్టు సభ్యులను ఎవరినీ ట్యాగ్ చేయలేదు.
నన్ను కూడా ట్యాగ్ చేయొచ్చు:
యువరాజ్ సింగ్ ట్వీట్ చూసిన రవిశాస్త్రి.. ఇదే సరైన సమయం అనుకుని సరదాగా ప్రతీకారం తీర్చుకున్నాడు. 'ధన్యవాదాలు జూనియర్. నువ్వు నన్ను, కపిల్ను కూడా ట్యాగ్ చేయొచ్చు' అని రీట్వీట్ చేశాడు. అయితే యువీ దానికి స్పందిస్తూ... 'హాహాహా సీనియర్. మైదానంలో, బయట నువ్వో దిగ్గజానివి. ఇక కపిల్ పాజీది వేరే స్థాయి' అని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కూడా 'యువరాజ్పై పగ తీర్చుకున్న రవిశాస్త్రి' అని కామెంట్లు పెడుతున్నారు.
అనుకున్నాం. అలాగే గెలిచాం:
అంతకుముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి మరో ట్వీట్ చేశాడు. 1983 ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నామని, అలాగే గెలిచామన్నాడు. '1983 జూన్ 25న ప్రపంచ చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నాం. అలాగే గెలిచాం. అలా భారతలో క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాం. ఈ సందర్భంగా అప్పటి కపిల్ డెవిల్స్కు, భారతీయులకు ధన్యవాదాలు' అని తన త్రోబ్యాక్ పిక్ జత చేస్తూ క్యాప్షన్గా పేర్కొన్నాడు.