న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ మనుగడపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్ అంతరించిపోకుండా మనుగడ సాగించాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సూచించిన సలహాతో ఏకీభవించాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్ను 40 ఓవర్లకు కుదించాలని అభిప్రాయపడ్డాడు. లేకుంటే వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
పాక్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ సైతం వన్డేలకు ఆదరణ పెరిగేందుకు ఈ ఫార్మాట్లో మార్పులు చేయాల్సిందిగా సూచించాడు. 'ఇప్పుడు వన్డే క్రికెట్ చాలా బోరింగ్గా మారిపోయింది. దీన్ని 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి 40 ఓవర్ల ఫార్మాట్గా మారిస్తే కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుంది...'అని అఫ్రిది కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలను సమర్థించిన రవిశాస్త్రి.. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు. మరోవైపు వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో నుంచి వన్డే ఫార్మాట్ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పడం ఈ ఫార్మాట్ మనుగడపై చర్చకు దారి తీసింది. టీ20లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో వన్డేలకు ఆదరణ లభించడంలేదని మాజీ క్రికెటర్లు వాదిస్తున్నారు. అందుకే ఫార్మాట్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.