బీసీసీఐ అలా చేస్తే ఆసియా కప్ కూడా బహిష్కరిస్తాం.. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వార్నింగ్!

రావల్పిండి: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత అభిమానులు పీసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్కు సిద్దం చేసిన పిచ్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఫ్లాట్ వికెట్పై ఇంగ్లండ్ జట్టు తొలి రోజే 506 పరుగులు చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసింది.
112 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును అధిగమించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ సైతం నిలకడగా ఆడుతుంది. దాంతో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 'ఈ వికెట్పై నేను కూడా సెంచరీ కొడతా'అంటూ ఓ పసివాడు ప్లకార్డు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. అభిమానులతో మాజీ క్రికెటర్లు సైతం పీసీబీపై మండిపడ్డారు.

పిచ్ విషయంలో విఫలమయ్యాం..
రమీజ్ రాజా సైతం తమ తప్పును అంగీకరించాడు. 'టెస్ట్ మ్యాచ్ పిచ్ ఎలా ఉండాలో ఇప్పటి వరకు ఒక అంచనాకు రాలేకపోయాను. ఇంతలా ఎందుకు నొక్కి చెబుతున్నానంటే ముందుగా ముల్తాన్, కరాచీ గ్రౌండ్లో పిచ్లు పరిశీలిస్తే ఇదే రకమైన ఫ్లేవర్ ఉంటుంది. బౌన్స్ ఉండదు. టీ20, వన్డే లకు ఇలాంటి పిచ్లు ఓకే కానీ టెస్ట్కు పనికిరావు. ఒక టెస్ట్ మ్యాచ్కు పిచ్ తయారు చేయడంలో పాకిస్థాన్ ఇంకా వెనుకబడే ఉంది'అని తమ అసమర్థతను రమీజ్ రాజా అంగీకరించాడు.

టాపిక్ డైవర్షన్..
అయితే ఈ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం రమీజ్ రాజా చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ 2023 గురించి మరోసారి ప్రస్తావించి చర్చ అటువైపు మళ్లే నాటకానికి తెరలేపాడు. తమ దేశంలో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీ బీసీసీఐ తమ పలుకుబడితో లాగేసుకునే ప్రయత్నం చేస్తే ఈ టోర్నీని కూడా బహిష్కరిస్తామని రమీజ్ రాజా హెచ్చరించాడు. 'మేం న్యాయబద్ధంగా సక్రమమైన రీతిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీఏ) నుంచి ఆసియా కప్ 2023 నిర్వహణకు ఆతిథ్య హక్కులు తీసుకున్నాం. భారత్ ఇక్కడికి రాకపోతే.. రాకపోనివ్వండి. మేం భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడం.

ఆసియాకప్ కూడా బహిష్కరిస్తాం..
ఒకవేళ బీసీసీఐ తమ పలుకుబడితో పాకిస్థాన్లో ఆసియా కప్ జరగకుండా తటస్థ వేదికకు తరలిస్తే.. ఈ టోర్నీని కూడా మేం బహిష్కరిస్తాం. పాక్లో కాకుండా ఎక్కడ జరిగినా మేం ఆడం. పాకిస్థాన్లో పరిస్థితులు మారిపోయాయని నిరూపించుకున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడ పర్యటించి వెళ్లాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు పెట్టుకోవడానికి రాజకీయ విషయాలు అడ్డుగా ఉన్నాయని తెలుసు. ఆసియా కప్ టోర్నీలో ఆడటానికి భారత్కు వచ్చిన ఇబ్బంది ఏంటి? మా వరకూ ఆసియా కప్ కూడా వరల్డ్ కప్ అంత పెద్దదే.'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

పాక్ వెళ్లే ముచ్చటే లేదు..
ఇక పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ ఆడకపోతే తమకు వచ్చే నష్టం ఏం లేదని, తాము పాకిస్థాన్కు మాత్రం వెళ్లేది లేదని పేర్కొంది. అసలు పాకిస్థాన్లో ఆసియా కప్ జరగదని, తటస్థ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించాడు. అతనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కావడంతో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ప్రపంచ క్రికెట్ను శాసించే భారత్ను ఎవరూ ఏం చేయలేరని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications