న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో భారత జట్టు వైఫల్యానికి స్వయంకృపరాదమే కారణమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా అన్నాడు. అనవసర ప్రయోగాలతో మూల్యం చెల్లించుకుందన్నాడు. ఇక ఆసియాకప్ 2022 లీగ్ దశలో వరుస విజయాలందుకున్న రోహిత్ సేన.. కీలక సూపర్ 4లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. అఫ్గానిస్థాన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ గెలిచినా లాభం లేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా చివరకు ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఆసియా కప్లో భారత్ జట్టు ప్రదర్శనపై స్పందించిన రమీజ్ రాజా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'పాకిస్థాన్ టీమ్ ఆసియా కప్ 2022లో ఎందుకు ఒకే కాంబినేషన్లో ఆడుతోంది? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆటగాళ్లు గాయపడితే తుది జట్టులో మార్పులు తప్పదు. కానీ మ్యాచ్లు గెలుస్తున్నప్పుడు విన్నింగ్ కాంబినేషన్ని మార్చాల్సిన అవసరం ఏముంటుంది? కానీ భారత్ అలా ఆలోచించలేదు. వాళ్లు తుది జట్టులో చాలా మార్పులు చేశారు. రిజర్వ్ బెంచ్ బలంగా లేనప్పుడు వారితో ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2022లో తొలుత పాకిస్థాన్, హాంకాంగ్ జట్లని ఓడించిన భారత్ జట్టు సూపర్-4కి అర్హత సాధించింది. కానీ.. సూపర్-4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆఖరిగా అఫ్గానిస్థాన్పై గెలిచినా ఫైనల్కి చేరలేకపోయింది. ఆసియా కప్ 2022లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ తుది జట్టులో మార్పులు చేయడం గమనార్హం. రవీంద్ర జడేజా గాయపడటంతో పాటు టీ20 ప్రపంచకప్ కోసం ప్రయోగాలు చేయడం టీమిండియా కొంపముంచాయి.
ఇక లీగ్ దశలో తడబడినా.. సూపర్ 4లో విజయాలందుకున్న పాక్, శ్రీలంక ఫైనల్ చేరాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ టోర్నీ ఫలితాలను పూర్తిగా టాస్ శాసించింది. టాస్ గెలిచిన జట్లే చేజింగ్ తీసుకొని విజయాలందుకున్నాయి. భారత్ ఓడిన రెండు మ్యాచ్ల్లోనూ టాస్ ఓడిపోయింది. ఇక శ్రీలంక గెలిచిన మూడు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు టాస్ గెలిచింది. దాంతో ఫైనల్ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన జట్టే టైటిల్ అందుకునే అవకాశం ఉంది.