ఆ బాధ తెలుసు..
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'భారత్-ఏ, అండర్-19 కోచ్గా ఉన్నప్పుడు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తానని నేను ముందే చెప్పేవాడిని. మ్యాచుల్లో అవకాశం దొరక్కపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. టీమిండియా-ఏకు ఎంపికై ఒక్క మ్యాచన్నా ఆడకపోవడం చెప్పలేనంత బాధాకరం. బెంచ్ మీదు కూర్చుంటే కలిగే బాధను చెప్పలేం.
ప్రతీ ఒక్కరికి..
ఓ టోర్నీలో ఓ ప్లేయర్ 700-800 పరుగులు చేసి భారత్-ఏకు ఎంపికయ్యాడు. కానీ నిరూపించుకోవడానికి అవకాశం రాలేదు. అప్పుడు సెలక్టర్ల దృష్టిలో అతను వెనకబడతాడు. తర్వాతి సీజన్లోనైనా 800 పరుగులు చేద్దామని భావిస్తాడు. కానీ అదంత సులభం కాదు. అవకాశం కచ్చితంగా దొరుకుతుందన్న ధీమా లేదు. అందుకే నేను 11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్-19లో వీలైతే ప్రతి మ్యాచ్కు ఐదారు మార్పులు చేసేవాడిని.' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
కనీస సౌకర్యాలుండేవి కాదు..
ఒకప్పుడు భారత క్రికెటర్లకు సరైనా ఫిట్నెస్ సహాయకులు, సౌకర్యాలు ఉండేవి కావని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన విజ్ఞానం కొరత ఉండేదన్నాడు. రిజర్వు బెంచీపై ఉంటే, రోడ్డు పక్కన ఆడితే సరైన క్రికెటర్ కాలేరన్నాడు. ఆటను ప్రేమిస్తేనే సాధ్యమని, అలాంటి చాలామంది క్రికెటర్లు ఇప్పుడు మనకున్నారని వెల్లడించాడు. ఆటగాళ్లకు సరైన పిచ్లు, కోచింగ్ ఇవ్వడం, ఫిట్నెస్ సహాయకులను ఏర్పాటు చేయడం అవసరమన్నాడు.
శరీరం మొద్దుబారుతుందని..
'1990, 2000ల్లో ఇలాంటి వసతులు లేవు. ఫిట్నెస్కు సంబంధించిన సమాచారం, విజ్ఞానం కొరత ఉండేది. మేం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫిట్నెస్ ట్రైనర్లను చూసేవాళ్లం. కానీ వారినుంచి మాకు ఎక్కువ సమాచారం దొరకేది కాదు. అతిగా జిమ్ చేయకండి. దేహం మొద్దు బారుతుందని చెప్పేవాళ్లు. పదేపదే బౌలింగ్ చేయండి. విరామం తీసుకుంటూ పరుగెత్తండి అనేవాళ్లు' అని ద్రవిడ్ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు.