ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణిస్తూ ఆల్రౌండర్గా సత్తా చాటుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో అశ్విన్ విధ్వంసకర బ్యాటింగ్తో తనలోని ఫినిషర్ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ సీజన్లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్లో బ్యాటింగ్ చేసిన అశ్విన్.. జట్టు ఇచ్చిన ప్రతీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. అశ్విన్ అద్భుత బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్స్ టేబుల్లో రెండో స్థానం కైవసం చేసుకుంది.
ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 7 పరుగులు అవసరమవ్వగా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే అశ్విన్ బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం అశ్విన్ గట్టిగా అరుస్తూ చాతిని గుద్దుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతని సెలెబ్రేషన్స్పై ప్రశ్నించగా.. ఆ క్షణం తనలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడని అశ్విన్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.'మిలియన్ డాలర్లు గెలిచిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ మ్యాచ్ గెలవడం మాకు చాలా ముఖ్యం. గ్రూప్ స్టేజ్ను విజయంతో ముగిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. టోర్నీ ముందే నా బాధ్యతలపై స్పష్టత ఉంది.
ఇక ఈ టోర్నీ కోసం నేను చాలా కష్టపడ్డాను. నా బ్యాటింగ్ స్థానం, రోల్ గురించి టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీగా చెప్పింది. బ్యాటర్గా రిస్క్ తీసుకోవాలని పేర్కొంది. గేమ్ బాగా అర్థం చేసుకోవాలని నేను ఎప్పుడూ నమ్ముతా. ప్లే ఆఫ్స్ చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఇక విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత నాలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడు.'అశ్విన్ చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ సైతం విభిన్నంగా సంబరాలు చేసుకుంటాడన్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ(57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 151 రన్స్ చేసింది. యశస్వీ జైస్వాల్(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 59), అశ్విన్ రాణించారు.