హైదరాబాద్: అఫ్గానిస్థాన్తో బెంగళూరు వేదికగా గురువారం నుంచి జరగనున్న చారిత్రక టెస్టు మ్యాచ్లో ఆడబోతుండటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు భారత్తోనే తొలి టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కాగా, అతని స్థానంలో కెప్టెన్గా రహానే ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడేందుకు ఈ టెస్టు నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోగా.. అతని స్థానంలో కెప్టెన్గా రహానె ఎంపికయ్యాడు. అయితే.. ఐపీఎల్లో గాయపడిన కోహ్లి.. కౌంటీల నుంచి కూడా తప్పుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
'అఫ్గానిస్థాన్ తొలి టెస్టులో ఆడబోతుండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది ఆ జట్టుకి ఓ చారిత్రక ఘటనకాగా.. అందులో భారత జట్టు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అఫ్గానిస్థాన్ జట్టులో చాలా మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తామేంటో ఇప్పటికే వారు నిరూపించుకున్నారు. కచ్చితంగా టెస్టు క్రికెట్లో కూడా ఆ స్థాయి ప్రదర్శనని కనబర్చేందుకు ప్రయత్నిస్తారు' అని అజింక్య రహానె వెల్లడించాడు.
భారత్ జట్టు తరపున అఫ్గాన్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని రహానె ప్రత్యర్థి జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. గాయం కారణంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టు నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కోహ్లి స్థానంలో కరుణ్ నాయర్ ఈ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.