న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అంటే తన సారథ్యంలోని అండర్-19 టీమ్ మొత్తం భయపడేదని యువ ఓపెనర్ పృథ్వీషా తెలిపాడు. కోచ్గా ద్రవిడ్ పర్యవేక్షణలో పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇండియా-ఎ, అండర్ 19 టీమ్ కోచ్గా టాలెంటెడ్ ప్లేయర్లను వెలికితీసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా సేవలందిస్తున్నాడు. అయితే ద్రవిడ్ పర్యవేక్షణలో అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా.. ఓ ఆటగాడిగా ది వాల్తో గడిపిన రోజులను క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.
'అండర్-19 ప్రపంచకప్కు ముందు కూడా ద్రవిడ్ సర్తో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లాం. ఆయనెప్పుడు తనలా ఆడాలని బలవంతం చేయరు. ఎవరి ఆటను మార్చుకోవాలని కూడా చెప్పరు. సహజ శైలిలో ఆడాలనే కోరుకుంటారు. నాకు కూడా సహజంగానే ఆడాలని సూచించారు. పవర్ ప్లే ఓవర్స్ ఆడితే నన్ను ఔట్ చేయడం కష్టమని సార్కు బాగా తెలుసు. ఆయన ఎక్కువగా మానసిక అంశాలు, ఆటకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చించేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ ఆటను ఆస్వాదించమని చెప్పేవారు. చేసిన తప్పులు పదే పదే చేస్తే తప్ప వారించేవారు కాదు.
ద్రవిడ్ సర్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మైదానం వెలుపల కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మాతో కలిసి డిన్నర్ కూడా చేసేవారు. అయినప్పటికీ ఆయనంటే కొంచెం భయంగా ఉండేది. ఆయన లాంటి దిగ్గజ క్రికెటర్ పక్కన కూర్చోవాలనే ప్రతి యువ ఆటగాడి కల. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలవడం నా జీవితంలోనే మరిచిపోలేని అనుభూతి. నా కల నేరవేరిన సందర్భం" అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా బీ టీమ్కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. సీనియర్ల జట్టుతో పాటే కోచ్ రవిశాస్త్రి వెళ్లనున్నాడు. దీంతో లంక టూర్ కోసం ద్రవిడ్కు కోచ్గా అవకాశం కల్పించారు.
ఇదే ఇంటర్వ్యూలో నిషేధానికి గురైన రోజులను కూడా షా గుర్తు చేసుకున్నాడు. తెలియక చేసిన తప్పిదంతో నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఈ ఘటనకు నేను, నా తండ్రే బాధ్యులం. తెలియక చేసిన పనితో ఈ కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం ఇండోర్లో ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు నేను జలుబు, దగ్గుతో బాధపడుతున్నా. ఆ రోజు రాత్రి డిన్నర్కు బయట వెళ్లాం. నా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా విపరీతంగా దగ్గుతుండటంతో మార్కెట్లో దగ్గు సిరప్ తెచ్చుకో అని చెప్పాడు. నేను డాక్టర్ను కన్సల్ట్ కాకుండా దగ్గు సిరప్ తెచ్చుకొని పెద్ద తప్పు చేశా.'అని షా చెప్పుకొచ్చాడు.