స్కానింగ్ కోసం బయటికి వెళితే
అత్యంత సురక్షితమని భావించిన బయో బబుల్లో పాజిటివ్ కేసులు బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఐపీఎల్ 2021 ఆగిపోయి నేటికి వారం అయింది. అయితే బబుల్ లోపలికి కరోనా ఎలా ప్రవేశించిందన్న విషయంలో రకరకాల సూత్రీకరణలు వినిపిస్తున్నాయి కానీ కచ్చితమైన కారణం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. కోల్కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్కానింగ్ కోసం బయటికి వెళ్లి వచ్చినపుడు కరోనాను మోసుకొచ్చాడని, అతను నేరుగా సహచరులను కలవడంతోనే ఆ జట్టులో వైరస్ వ్యాప్తి జరిగిందనే వార్తలొచ్చాయి. అదే నిజమయితే చెన్నై, హైదరాబాద్ జట్లలో పాజిటివ్ కేసులు ఎలా బయటపడ్డాయన్నది ప్రశ్న.
సరిపడా ప్రాక్టీస్ సదుపాయాలు లేవు
చెన్నై, ముంబైల్లో మ్యాచ్లు ముగిశాక ఆటగాళ్లు రెండో దశ మ్యాచ్ల కోసం ఢిల్లీ, అహ్మదాబాద్లకు వెళ్ళడానికి విమాన ప్రయాణాలు చేశారు. ఇక ఈ రెండు నగరాల్లో ఐపీఎల్ 2021 మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన స్టేడియాల్లో నాలుగు జట్లకు సరిపడా ప్రాక్టీస్ సదుపాయాలు లేకపోవడం వైరస్ వ్యాప్తికి పరోక్ష కారణాలన్న వాదన ఇప్పడు బలంగా వినిపిస్తోంది.
కొత్తగా పునర్నిర్మితమైన మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్ నెట్స్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. దీంతో కోల్కతా సహా కొన్ని జట్లు అహ్మదాబాద్లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్కు వెళ్లి సాధన చేశాయట.
Wrestler murder: ఆచూకీ లేని స్టార్ రెజ్లర్.. లుకౌట్ నోటీసులు జారీచేసిన ఢిల్లీ పోలీసులు!!
రోషనారా మైదానానికి ఆటగాళ్లు
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో నెట్స్ సరిపోక రద్దీ ప్రాంతంలో ఉండే రోషనారా మైదానానికి సాధన కోసం చెన్నై సహా కొన్ని జట్లు వెళ్లాయి. అక్కడి సిబ్బందిలో ఎవరూ ఐపీఎల్ 2021 బయో బబుల్ పరిధిలో లేరు. వారికి కరోనా పరీక్షలేమీ నిర్వహించలేదని తాజాగా సమాచారం తెలుస్తోంది.
ఢిల్లీ, అహ్మదాబాద్ మైదానాలకు వెళ్లి వచ్చే క్రమంలో, సాధన చేసేటపుడు వస్తువుల వినియోగం లేదా గాలి ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం లేకపోలేదని నిపుణులు కూడా అంటున్నారు. బబుల్లోకి కరోనా ప్రవేశానికి పరోక్షంగా ప్రాక్టీసే కారణమని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీసే ఐపీఎల్ 2021 కొంపముంచడానికి అసలు కారణం అని అంటున్నారు.
ఆన్లైన్ ఆర్డర్ ద్వారా భోజనం
స్వదేశంలో పకడ్బందీగా బబుల్ లేకపోవడం వల్లే ఐపీఎల్ 2021 అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఇప్పటికే ఓ వార్త ప్రచారంలో ఉంది. హోటళ్ల సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటం, వారికి నిర్బంధ క్వారంటైన్ లేకపోవడం.. అలాగే మైదానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎవరూ బబుల్ నిబంధనలు పాటించకపోవడం లాంటివి ఆటగాళ్లకు కరోనా సోకేలా చేసిందట. ఇక ఆటగాళ్లు ఎక్కడి నుంచైనా నచ్చిన భోజనాన్ని ఆన్లైన్ ఆర్డర్ ద్వారా తెప్పించుకునే అవకాశం కల్పించడం కూడా మరో కారణం అని అన్నారు.