
ఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం ఇప్పుడు మరింత సీరియస్గా మారింది. యువ రెజ్లర్ సాగర్ దంకడ్ హత్యోదంతానికి సంబంధించి సుశీల్పై ఢిల్లీ పోలీసులు 'లుకౌట్ నోటీసులు' జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆచూకీ లేకపోవడంతో ఆదివారం సాయంత్రం 'లుకౌట్ నోటీసులు నోటీసు ఇచ్చినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామన్నారు.
ఈ నెల 4న సాగర్తో పాటు అతడి ఇద్దరు మిత్రులపై ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణలో సుశీల్ కుమార్ బృందం హాకీ, బేస్బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడగా.. తలకు తీవ్ర గాయమై సాగర్ మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడిలో సుశీల్ పాల్గొన్నట్లు వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు చెప్పారు. సాగర్ మృతి వార్త బయటికి రాగానే సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం 5 రోజుల పాటు పోలీసులుఢిల్లీ, హరియాణా సహా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ సుశీల్ వారి చేతికి చిక్కలేదు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేయాల్సి వచ్చింది.
సాగర్ దంకడ్ హత్య కేసులో సుశీల్ కుమార్ లాంటి దిగ్గజ రెజ్లర్పై ఆరోపణలు రావడం భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 'ఈ ఉదంతం వల్ల భారత రెజ్లింగ్ ప్రతిష్ఠ దెబ్బ తింటోందని చెప్పక తప్పదు. ఒకప్పుడు రెజ్లర్లంటే గూండాలనే పేరుండేది. అది పోయి దేశంలో రెజ్లర్లకు మంచి పేరు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇలాంటి ఉదంతాల వల్ల రెజ్లింగ్ ప్రతిష్ఠ దెబ్బ తింటోంది; అని డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు.
సుశీల్ కుమార్ పేరు వివాదాల్లోకి ఎక్కడం ఇది తొలిసారేం కాదు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో సుశీల్ పోటీపడాల్సిన విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ అర్హత సాధించాడు. అయితే ఆ తర్వాత జరిపిన డోప్ టెస్టులో నర్సింగ్ నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీని వెనుక సుశీల్ హస్తం ఉందనే వాదనలు అప్పట్లో బలంగా వినిపించాయి. నర్సింగ్ తీసుకుంటున్న ఆహారంలో కావాలనే సుశీల్ వర్గం ఉత్ప్రేరకాలు కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. 2018 కామన్వెల్త్ క్రీడల సమయంలోనూ సుశీల్.. సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణాపై చేయి చేసుకొని వార్తల్లోకెక్కాడు.
దేశానికి స్టార్ రెజ్లర్లను అందించిన ఛత్రాసాల్ స్టేడియం ప్రారంభం నుంచి సుశీల్ కుమార్ కుటుంబ కనుసన్నల్లోనే ఉంది. సుశీల్తో పాటు యోగేశ్వర్ దత్, బజరంగ్ పునియా, రవి దహియా, దీపక్ పునియా వంటి ఎందరో ఆటగాళ్లు రెజ్లింగ్లో ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారు. సుశీల్ మేనమామ, 1982 ఆసియా క్రీడల చాంపియన్ సత్పాల్ సింగ్ 2016 వరకు ఈ స్టేడియానికి అడిషనల్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాతి నుంచి సుశీల్ కుమార్ ఓఎస్డీగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ప్రవేశం నుంచి శిక్షణ వరకు అంతా అతడి కనుసన్నల్లోనే సాగుతున్నది. ఏదైనా ప్రశ్నించే ధైర్యం యువ రెజ్లర్లకు లేదని వార్తలు కూడా ఉన్నాయి.