2022 పాక్లోనే..
ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీం ఖాన్ వెల్లడించారు. 2021 జూన్లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరుగుతుందని, ఆ తర్వాతి ఏడాది తమ దేశంలో ఆసియా కప్ నిర్వహిస్తామని తెలిపారు. ‘షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లోనే ఆసియా కప్ను పాక్లో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ 2021 జూన్కు మార్చారు. వచ్చే ఏడాది ఆసియా కప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2022 ఎడిషన్ ఆతిథ్య హక్కులు పాక్కు దక్కాయి.'అని వసీం ఖాన్ తెలిపాడు.
ఉగ్రదాడి నేపథ్యంలో..
పదేళ్ల క్రితం పాకిస్థాన్లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. లంక ఆటగాళ్లు ప్రయాణిస్తోన్న బస్సుపై ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత అంతర్జాతీయ జట్లు ఆ దేశానికి వెళ్లడానికి జంకుతున్నాయి. అయితే గతేడాది శ్రీలంక జట్టే పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలంలో జింబాబ్వే, బంగ్లాదేశ్ పాక్ గడ్డ మీద పర్యటించాయి. భారత్తోపాటు కొన్ని ఇతర జట్లు పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు సుముఖంగా లేవు.
భారత్ మొండిపట్టు..
2022లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాక్లో పర్యటించేలా పీసీబీ ఒప్పించింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ జట్టు కూడా పాక్లో పర్యటించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 ఆసియా కప్ వాయిదా పడక ముందు.. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ వెళ్లబోమని బీసీసీఐ తెలిపింది. పాక్ బదులుగా తటస్థ వేదికైన యూఏఈలో టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టింది. 2022కు ఆసియా కప్ వాయిదా పడటంతో.. అప్పటికైనా బీసీసీఐ మనసు మార్చకుంటుందనే ఆశతో పీసీబీ ఉంది. కానీ బీసీసీఐ ఇదే పట్టుదలతో ఉంటే.. మాత్రం వేదిక మార్చాల్సిన పరిస్థితి రావచ్చు.