ఆ పోలిక బాగుంది.. కానీ నా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది: పంజాబ్ హిట్టర్

ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్తో పోల్చడం సంతోషంగా అనిపించిందని పంజాబ్ కింగ్స్ హిట్టర్ షారుక్ ఖాన్ అన్నాడు. కానీ తన కెరీర్ ఇప్పుడే ఆరంభమైందని పేర్కొన్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడటం అద్భుతంగా ఉందన్నాడు. జట్టులో తనకు తెలిసినవాళ్లే ఎక్కువమంది ఉన్నారని తెలిపాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థాంతరంగా వాయిదా పడటంతో తమిళనాడులో ఉన్న షారుఖ్ ఖాన్.. లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఇంటివద్దే సాధన చేస్తున్నాడు. తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నాకు స్పెషల్గా ఏం చెప్పలేదు..
'ఐపీఎల్లో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. కొన్నేళ్లుగా లీగ్ను టీవీలో చూస్తున్నాను. ఈ ఏడాది ఏకంగా ఆడేశాను. గొప్ప ఆటగాళ్లను కలిసే అవకాశం వచ్చింది. 2-3 ఇన్నింగ్స్లు బాగా ఆడాను. కుంబ్లే నన్ను పొలార్డ్తో పోల్చడం బాగుంది. అయితే నా కెరీర్ ఇప్పుడే ఆరంభమైంది. అతని స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా. పంజాబ్లోని చాలామంది ఆటగాళ్లతో నాకు అనుబంధం ఉంది. కేఎల్ రాహుల్, అనిల్ కుంబ్లే నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. తమిళనాడుకు ఎలా ఆడానో అలాగే ఆడమన్నారు. జట్టు పేరు మాత్రమే మారింది. బంతి, ఆట ఒకటేనన్నారు.

అందుకే అలా ఆడాను..
పంజాబ్ జట్టులో తనకు ప్రత్యేకమైన పాత్ర అప్పగించలేదు. చెన్నై పోరులో 4/5తో ఉండటంతో నిలకడగా ఆడుతూ 47 పరుగులు చేశాను. పరిస్థితులను బట్టి ఆడాను. వికెట్లు పడుతుండటంతో షాట్లు ఆడలేకపోయాను. వికెట్లు కనుక చేతిలో ఉండి ఉంటే ధాటిగా ఆడేవాడిని. జట్టుకు మంచి స్కోర్ అందించేవాడిని. లీగ్ వాయిదాపడే సమయానికే నేను వ్యక్తిగతంగా జోరందుకున్నాను. కానీ ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొంటే వాయిదా వేయడమే సరైంది. అయితే ఈ వాయిదా ఎఫెక్ట్ నాపై ఏమాత్రం ఉండదు. మానసికంగా ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉండటం అన్నిటి కంటే ముఖ్యం.

టెక్నిక్ అడ్జస్ట్ చేసుకుంటా..
ప్రస్తుతం రెండు మూడు నెలల విరామం దొరికింది. ఈ విరామాన్ని రిష్రెష్ అవ్వడానికి ఉపయోగించుకుంటా. నా గేమ్ను ఏ మాత్రం మార్చుకోను. కానీ టెక్నిక్ను అడ్జస్ట్ చేసుకుంటా. మా ఇంట్లో ఇప్పటికే ట్రైనింగ్ మొదలుపెట్టా. ఇంట్లో నాకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో పూర్తి లాక్డౌన్ విధించారు. అయినా నేను సాధన చేస్తున్నా.ఫిట్నెస్పై దృష్టిసారించా'అని షారుక్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

రూ.5.25 కోట్ల భారీ ధర..
దేశవాళీ క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన షారుక్ ఖాన్... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడును చాంపియన్గా నిలబెట్టాడు. డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించడం అతనికి అలవాటు. దాంతో ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.5.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే షారుక్ ఖాన్ ఇంకా అంచనాలు అందుకోలేకపోయాడు. ఒకటి రెండు మ్యాచుల్లో విలువైన ఇన్నింగ్సులే ఆడినా పూర్తి స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకోలేకపోయాడు. వాస్తవానికి అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. సెకండ్ ఫేజ్ ఐపీఎల్లోనైనా రాణించాలని భావిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications