రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని మరి బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్లో ఇండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కోహ్లీతో టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
రోహిత్, ధావన్కు గాయం.. మూడో వన్డేకు డౌట్!
ఇక తప్పక నెగ్గాల్సిన రెండో వన్డేలో కోహ్లీసేన జూలు విధిల్చింది. శిఖర్ ధావన్(96, కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80)లకు తోడుగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో మూడో వన్డేల సిరీస్ను 1-1తో సమమైంది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ మూడో స్థానంలోనే బరిలోకి దిగాడు. దీనిపై మ్యాచ్ అనంతరం స్పందిస్తూ.. జట్టు మేలుకోసమే తాను మళ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చినట్లు తెలిపాడు.
'సోషల్ మీడియా ప్రభావం ఎక్కువున్న రోజుల్లో జీవిస్తున్నాం. కాబట్టి అందరు మెచ్చే జట్టును గుర్తించడం చాలా ముఖ్యం. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయానందుకోవడం సంతోషంగా ఉంది. ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతని పరిణతి, క్లాస్ను తెలియజేస్తోంది.
విమర్శల నేపథ్యంలో కాకున్నా జట్టు శ్రేయస్సు కోసమే మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగా. ఇది జట్టుకు ఉపయోగపడింది. వన్డేల్లో స్థిరంగా రాణించే బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్ ఒకడు. అతను రోహిత్తో కలిసి శుభారంభం అందించడం ఆనందంగా ఉంది.
రోహిత్ భుజానికి గాయమైంది. అయితే అతనిది మాములు గాయమే. ఎలాంటి చీలిక లేదు. అతను మూడో వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక మూడో వన్డే ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.