న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ కరోనా వైరస్ కలకలంరేగింది. డిసెంబరు 18 నుంచి కివీస్తో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ని ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు అక్కడికి వెళ్లింది. కానీ అక్కడ క్రమశిక్షణతో ఉండకుండా పదే పదే బయో- సెక్యూర్ బబుల్ వెలుపలికి వెళ్లిన పాక్ క్రికెటర్లు.. మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ.. వారు తమ తీరుని మార్చుకోలేదు.
దాంతో.. తాజాగా పాకిస్థాన్ టీమ్లో మరో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తంగా ఆ సంఖ్య ఏడుకి చేరింది. అయితే కరోనా నిబంధనలను అధిగమించిన యువ స్పిన్నర్ రాజా హసన్ పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా కఠినంగా వ్యవహరించింది. అతన్ని న్యూజిలాండ్ నుంచి ఇంటికి పంపించింది. ఈ విషయాన్ని సోమవారం స్పష్టం చేసింది. మెడికల్ టీమ్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బయోబబుల్ ధాటాడని తెలిపింది.
న్యూజిలాండ్ టూర్కి ఆటగాళ్లు, కోచ్లు, సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 46 మందిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పంపింది. ఇందులో తొలుత నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల్లో 42 మందికి నెగటివ్రాగా.. తాజాగా ఇందులో మరో ముగ్గురుకి పాజిటివ్ వచ్చింది. పాక్ ఆటగాళ్లు అక్కడ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఓ రెండు మూడు సందర్భాల్లో క్వారంటైన్ నిబంధనలను అధిగమించినట్లు వెలుగులోకి వచ్చింది. దాంతో.. పాక్ క్రికెట్ బోర్డు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది.
న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన తొలి మూడు రోజులు.. పాక్ ఆటగాళ్లు చాలా నిర్లక్షంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతుంది. క్వారంటైన్ టైమ్లో భోజనం పంచుకోవడం, మాస్క్లు ధరించకపోవడం, ఒకే చోట కూర్చుని ముచ్చటించడం లాంటివి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఇకపై ఎవరైన ఆటగాడు రూల్స్ని బ్రేక్ చేస్తే..? టూర్ నుంచి వెనక్కి పిలిపిస్తామని పాక్ బోర్డు గట్టిగానే హెచ్చరించింది. అయినా రాజా హసన్ నిబంధనలు అతిక్రమించడంతో కఠినంగా వ్యవహరించింది.