కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ అనిశ్చితికి మారు పేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశ ఆటగాళ్లతో పాటు క్రికెట్ బోర్డు నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. సునాయసంగా గెలిచే మ్యాచ్ను ఓడిపోవడం.. అసలు ఆశలే లేని స్థితి నుంచి భారీ విజయాలు అందుకోవడం పాకిస్థాన్ జట్టుకు అలవాటు. అందుకే పాకిస్థాన్ టీమ్ను నిలకడలేని జట్టు అభిమానులు అభివర్ణిస్తుంటారు. టీమ్ పెర్ఫామెన్సే కాదు .. ఆఫ్ ది ఫీల్డ్లో జట్టు నిర్ణయాలు కూడా ఇలా షాకింగ్గానే ఉంటాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్ను మార్చగా.. చీఫ్ సెలెక్టర్గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని ఎంపిక చేశారు.
తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు షాన్ మసూద్ను వైస్ కెప్టెన్గా పీసీబీ నియమించింది. కరాచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వైస్ కెప్టెన్కే తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. వాస్తవానికి బాబర్ ఆజమ్ డిప్యూటీగా గత మూడేండ్లుగా షాదాబ్ ఖాన్ ఉండేవాడు. కానీ వేలి గాయం కారణంగా అతడి స్థానాన్ని మసూద్ భర్తీ చేస్తున్నాడు.
సుమారు మూడేండ్ల తర్వాత మసూద్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2019లో ఆసీస్ తో ఐదు వన్డేల సిరీస్ తర్వాత మసూద్ వన్డేలు ఆడలేదు. ఇటీవల కాలంలో అతడు టీ20లలో నిలకడగా రాణిస్తుండటంతో వన్డే జట్టుకు పిలుపొచ్చింది. అంతేగాక పీసీబీ అతడిని బాబర్ ఆజమ్ కు డిప్యూటీగా కూడా చేసింది. అయితే అతడు న్యూజిలాండ్ తో తొలి వన్డేలో మాత్రం బెంచ్ మీదే కూర్చోవడం చర్చనీయాంశమైంది. వైస్ కెప్టెన్కే జట్టులో చోటు లేకపోవడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
షాన్ మసూద్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం బాబర్ ఆజామ్కు ఇష్టం లేదేమోనని సందేహిస్తున్నారు. భవిష్యత్లో మసూద్ తన స్థానానికి ఎసరు పెట్టే అవకాశమున్నదని బాబర్ భయపడుతున్నాడమోనని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్కు ముందు టీమ్ కాంబినేషన్పై బాబర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వైస్ కెప్టెన్ అయినా ఎవరైనా తనకు అనవసరమని, బెస్ట్ ఎలెవన్తో బరిలోకి దిగుతామని బాబర్ అన్నాడు. ఉద్దేశపూర్వకంగానే మసూద్ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
PCB made Shan Masood as Vice Captain of ODI but he is not part of playing 11.
— Johns. (@CricCrazyJohns) January 9, 2023
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 255 పరుగులు చేసింది. టామ్ లాథమ్(42), మైకేల్ బ్రేస్వెల్(43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. ఉస్మా మిర్కు రెండు వికెట్లు దక్కగా.. మహమ్మద్ నవాజ్, మహమ్మద్ నసీమ్కు చెరొక వికెట్ లభించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాక్ 108 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు.