హైదరాబాద్: వరల్డ్కప్ని టీమిండియా ఘనంగా ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా సంపాదించిన ఆత్మ విశ్వాసాన్ని ప్యాక్ చేసి తదుపరి మ్యాచ్కి సన్నద్దమవ్వాలని కోహ్లీసేనకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో రోహిత్ శర్మ సెంచరీ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు)తో చెలరేగగా, బౌలింగ్లో బుమ్రా(2/35), చాహల్(4/51) మెరుపులు మెరిపించారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం(జూన్ 9)న తన తర్వాతి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "తొలి విజయం ఎల్లప్పుడూ కొంత ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఆరంభం సరైన మార్గంలో ఉంది కాబట్టి దానిని కొనసాగిస్తే సరిపోతుంది. ఏదైతే సాధించారో అందుకు డ్రెస్సింగ్ రూమ్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ మ్యాచ్ ముగిసింది. ఇదే ఆత్మ విశ్వాసాన్ని ప్యాక్ చేసి తదుపరి మ్యాచ్కి సన్నద్దమవ్వాలి" అని అన్నాడు.
"ఓవల్ వేదికగా ఆసీస్-టీమిండియా జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పిచ్లో బౌన్సింగ్ ఎక్కువగా ఉంటుంది. అది ఆసిస్ బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ మెరుగ్గా ఉంది. అయితే, భారత బ్యాట్స్మెన్ వారిని తప్పక ఎదుర్కొంటారు. గతంలోనూ ఇదే జట్టుపై భారత్ మంచి ప్రదర్శనే చేసింది" అని సచిన్ తెలిపాడు.
"డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్ తిరిగి జట్టులో చేరడంతో ఆస్ట్రేలియా మరింత బలంగా మారింది. ముఖ్యంగా వార్నర్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు. అతడిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది" అని సచిన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్కి ముందు సచిన్ కోహ్లీ సేనకు కొన్ని సూచనలు చేశాడు.
ఆదివారం జరిగే మ్యాచ్లో ఆసీస్ బౌలింగ్ ధాటికి వికెట్లు పోయినా దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇంగ్లాండ్లో బౌన్సీ పిచ్లు కాబట్టి వికెట్లు పడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. స్కోరుబోర్డు మీద పరుగులే ఏ జట్టు విజయం సాధిస్తుందో నిర్ణయిస్తాయని సచిన్ అన్నాడు.
వరల్డ్కప్లో సఫారీలు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలయ్యారు. దీంతో సెమీస్కు చేరే ఆశలను సంక్లిష్టం చేసుకున్నారు. ముఖ్యంగా జట్టుని గాయాలు వేధిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సఫారీలు బాక్సు బయటకు వచ్చి ఆడాల్సిన సమయం ఆసన్నమైందని సచిన్ సూచించాడు.
"ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా పోటీలో నిలవాలంటే బాక్సు బయటకు వచ్చి మరీ ఆడాలి. జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించాలి. ఆ జట్టుకు మద్దతు అవసరం. జట్టంతా భిన్నంగా ఆలోచించాలి. జట్టులోని ఆటగాళ్లంతా పేసర్ లుంగి ఎంగిడిని మిస్సవుతున్నారు" అని సచిన్ పేర్కొన్నాడు.