
హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓపెనర్గా టీమిండియా విజయాల్లో కీలకంగా వ్యవహారించాడు. మ్యాచ్లో తొలి బంతిని బౌండరీగా మలిచిన సందర్భాలు ఎన్నో. అందుకే సెహ్వాగ్ను అభిమానులు ముద్దుగా డాషింగ్ హీరో అని సంబోధిస్తుంటారు.
భారత అభిమానులు ఎన్నో సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్లను చూశారు. బరిలోకి దిగాడంటే మొదటి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తాల్సిందే. 2009లో సరిగ్గా ఇదే రోజున వీరేంద్ర సెహ్వాగ్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
2009లో డిసెంబర్ 4న ముంబైలోని వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 293 పరుగుల వద్ద శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఫలితంగా తృటిలో ట్రిపుల్ సెంచరీని మిస్సయ్యాడు. ఈ క్రమంలో మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్కు మాత్రమే సొంతమైన రికార్డును సెహ్వాగ్ అందుకున్నాడు. టెస్టుల్లో 290కి పైగా మూడు సార్లు స్కోర్ చేసిన రెండో బ్యాట్స్మెన్గా రికార్డు సాధించాడు. సెహ్వాగ్ 293 వీడియోని బీసీసీఐ ట్వీట్ చేస్తూ "మిస్టర్ ట్రిపుల్ టన్ సెహ్వాగ్" అని కామెంట్ పెట్టింది.
దీనికి ముందు టెస్టుల్లో సెహ్వాగ్ రెండు సార్లు ట్రిపుల్ సెంచరీని సాధించాడు. టీమిండియా తరుపున ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్మన్ సెహ్వాగే. 2004లో పాకిస్థాన్పై 309 పరుగులు చేసిన సెహ్వాగ్.. 2008లో సఫారీలపై 319 పరుగులతో ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.