మెల్బోర్న్: ఫస్ట్ టెస్ట్ చిత్తుగా ఓడిన భారత జట్టు కోచ్గా తనను ఏ మాత్రం ఊహించుకోలేనని ఆస్ట్రేలియా టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే పేలవ ప్రదర్శనతో జట్టు ఎదుర్కోనే బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాపై తీవ్ర ఒత్తిడి ఉందని, అది తమ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఈ క్రిస్మస్ వీకెండ్ను తాము సంతోషంగా గడుపుతామని, సెకండ్ టెస్ట్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పింక్ బాల్ టెస్టులో రెండు రోజులు ఆధిపత్యం కనబర్చిన కోహ్లీ సేన సెకండ్ ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆట ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. భారత బ్యాట్స్మెన్ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. దాంతో టీమ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ ఓటమి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలగాలంటూ నెటిజన్లు మండిపడ్డారు. అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండో టెస్ట్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన లాంగర్ ముందు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
రవిశాస్త్రి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని అడగ్గా.. 'అసలు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ఇప్పటికే నాకున్న ఒత్తిళ్లు చాలు. అయితే వారి బాధను నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు టీమిండియాపై ఒత్తిడి ఉందనేది వాస్తవం.ఇక కోహ్లీ, షమీ గైర్హాజరీ కూడా మాకు కలిసి వస్తుంది.సెకండ్ టెస్ట్ మేం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. ఏ ఆటలోనైనా స్టార్లు లేకుంటే ప్రత్యర్థి జట్టుకు లాభిస్తుంది. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. షమీ కూడా మంచి బౌలర్. వాళ్లు లేకపోవడం మాకు సానుకూలాంశమే. ఇక రెండో టెస్టులో మొదటి రోజు నుంచే రహానేపై ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగుతాం' అని పేర్కొన్నాడు.