ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు
టీమిండియా నూతన కోచ్ విషయంపై మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగ్గా... 'రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్ అవుతున్నాడన్న విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదు. ఇంకా సమయం ఉంది కదా' అని బదులిచ్చాడు. అక్టోబర్ 17నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 24న పాకిస్థాన్తో ఆడనుంది. ఇక ఈ టోర్నీ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
ద్రవిడ్తో మంచి అనుబంధం
భారత్ తర్వాతి కోచ్గా ఇదివరకు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పేరు వినిపించినా.. ఇప్పుడు అనూహ్యంగా రాహుల్ ద్రవిడ్ పేరు తెరపైకి రావడం విశేషం. చాలా కాలంగా ది వాల్.. అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్గా చేసిన అనుభవంతో పాటు ఎన్సీఏ హెడ్గానూ సేవలందిస్తున్నాడు. దీంతో ప్రస్తుత జట్టులోని చాలా మంది యువ క్రికెటర్లకు ద్రవిడ్తో మంచి అనుబంధం ఉంది.
అతడి శిక్షణలోనే పృథ్వీ షా, రిషబ్ పంత్, అవేశ్ ఖాన్, హనుమ విహారి, శుభ్మన్ గిల్ లాంటి యువ క్రికెటర్లు మేటి ఆటగాళ్లుగా తయారయ్యారు. మరోవైపు రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్లు ఉన్న నేపథ్యంలోనూ ద్రవిడే టీమిండియాకు సరైన కోచ్ అని అభిమానులు, మాజీలు పేర్కొంటున్నారు.
అందుకే అశ్విన్కు చోటిచ్చాం
టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు మెంటార్గా ఎంఎస్ ధోనీ ఉండటంపై విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు మహీ అనుభవం, అతడు ఇచ్చే సలహాలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయన్నాడు. 'ఎంఎస్ ధోనీకి మంచి అనుభవం ఉంది. జట్టు ఆటగాళ్లందరికీ అతడే మెంటార్. ధోనీ భాయ్ వల్ల యువ ఆటగాళ్లందరికీ ఎంతో లాభం కలుగుతుంది.
అతనికి ఉన్న అనుభవం, తాను ఇచ్చే సలహాలతో భారత జట్టు ఆటతీరు రెట్టింపు అవుతుంది. ప్లేయర్స్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది' అని కోహ్లీ చెప్పాడు. భారత జట్టు రవిచంద్రన్ అశ్విన్కు చోటు లభించడంపై కూడా భారత కెప్టెన్ స్పందించాడు.
'గత రెండేళ్లుగా ఐపీఎల్లో ఆర్ అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. క్రీజులో హిట్టర్లు ఉన్నా.. డెత్ ఓవర్లలో అశ్విన్ బౌలింగ్తో రాణించాడు. అందుకే టీ20 ప్రపంచకప్లో అతడిని ఎంపిక చేశాం. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం అతడిగి బాగా ఉంది' అని విరాట్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్తో మ్యాచ్ ఓ గేమ్ మాత్రమే
భారత్-పాకిస్థాన్ మ్యాచుపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'తొలి మ్యాచ్ పాకిస్థాన్తో జరగనున్న నేపథ్యంలో దీని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇది కేవలం గేమ్ మాత్రమే. అభిమానుల దృష్టిలోనే ఇది పెద్ద మ్యాచ్. కానీ ఆటగాళ్లు ఇతర జట్లతో ఆడినట్లే ఈ మ్యాచ్ కూడా ఆడతారు' అని చెప్పాడు.
ఐదేళ్ల విరామం తర్వాత టీ20 ప్రపంచకప్ 2021 జరుగుతోంది. పొట్టి టోర్నీని ఈ సారి బీసీసీఐ ఆతిథ్యమిస్తుంది. కానీ మ్యాచ్లు మాత్రం యూఏఈ, ఒమన్లో జరగనున్నాయి. దేశంలోని కరోనా పరిస్థితి మేరకు టోర్నమెంట్ను భారతదేశం నుంచి యూఏఈకు తరలించారు. మెగాటోర్నీలో ఈసారి అత్యధికంగా 16 జట్లు పాల్గొంటున్నాయి.