ఆండ్రీ రసెల్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం ఆండ్రీ రసెల్ మాట్లాడుతూ "నేను బ్యాటింగ్కు దిగేటప్పుడు నమ్మకంతోనే ఉన్నా. పిచ్ను బట్టి అర్ధం చేసుకునేందుకు కొన్ని బంతులను వినియోగించుకోమని నాకు దినేశ్ కార్తిక్ సలహా ఇచ్చాడు. డగౌట్ లో కూర్చుని టీవీని చూస్తున్నప్పుడు ఇది మంచి ఐడియా అనిపించింది. 20 బంతుల్లో 68 పరుగులు చేయాలని అప్పుడే అర్థమైంది" అని అన్నాడు.
ఇలాంటి రోజు ఎప్పుడూ ఎదురు కాలేదు
"ఇలాంటి రోజు నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. అప్పుడే నాలో నేను ఆలోచించుకుని ఏకాగ్రత పెంచుకున్నాను. టీ20 క్రికెట్లో ఇలాంటి మూమెంటే మ్యాచ్ని మారుస్తుంది. అయితే, ఒత్తిడిలో ఎలా కొట్టానో నాకే తెలీదు. టీ20ల్లో ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం సహజం. నచ్చిన విధంగా ఆడటానికి నాకు జట్టులో స్వేచ్ఛ ఉంది" అని ఆండ్రీ రసెల్ చెప్పాడు.
ఐదు బంతులు మిగిలుండగానే గెలిచాం
"ఐదు బంతులు మిగిలుండగానే గెలిచాం. కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్వేచ్ఛ కారణంగానే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడూ నన్ను ప్రోత్సహిస్తారు. కాబట్టే నేను ఏకాగ్రతతో ఆడగలుగుతున్నాను" అని ఆండ్రీ రసెల్ తెలిపాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసింది.
206 పరుగుల లక్ష్యంతో
అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ ఒకానొక దశలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ విజయానికి చివరి 18 బంతుల్లో 53 పరుగులు చేయాలి. దీంతో అంతా ఆర్సీబీ విజయం సాధిస్తుందని భావించారు. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్కు వచ్చాడు. రెండు బంతులు వేశాడు.
నోబాల్ను సిక్సర్గా
అందులో ఓ నోబాల్ దానిని రసెల్ సిక్సర్గా మలిచాడు. మిగిలిన నాలుగు బంతులు వేసిన స్టోయినిస్ రెండు సిక్సర్లు సమర్పించుకున్నాడు. దీంతో కేకేఆర్ విజయసమీకరణం 12 బంతుల్లో 30 పరుగులుగా మారింది. ఈ దశలోనూ ఆర్సీబీనే విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, టిమ్ సౌథీ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4, 6తో 29 పరుగులు రాబట్టి విజయాన్ని అందించాడు.