దుబాయ్: అబుదాబి టీ10 లీగ్లో వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ నికోలస్ పూరన్ పరుగుల సునామీ సృష్టించాడు. లీగ్లో నార్తర్న్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీస్ వీరుడు.. బంగ్లా టైగర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ పూరన్ విధ్వంసానికి నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది.
పూరన్(89)కి తోడుగా లెండి సిమ్మన్స్(41) రాణించాడు. అనంతరం బంగ్లా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఆండ్రూ ఫ్లెచర్ (53), చిరాగ్ సూరి( 42)రాణించినా ఫలితం లేకపోయింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నార్తర్న్ వారియర్స్కు ఓపెనర్ వసీమ్ మహమ్మద్ తొలి ఓవర్లలోనే రెండు సిక్సులు బాది శుభారంభాన్ని అందించాడు. అయితే 12 పరుగులు చేసిన తర్వాత వసీం ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సిక్స్తో ఖాతా తెరిచాడు. తర్వాత సిమ్మన్స్ కూడా ధాటిగా ఆడాడు.
ఈ ఇద్దరూ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని ధాటికి బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. మొత్తం 12 సిక్స్లతో వీరవిహారం చేసిన పూరన్ 26 బంతుల్లోనే 89 పరుగులు చేసి కరీమ్ జనత్ బౌలింగ్లో ఔటయ్యాడు. టీ10 లీగ్లో పూరన్కు ఇది ఐదో అర్ధసెంచరీ.
ఈ లీగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు ఈ విండీస్ వీరుడివే. ఈ మ్యాచ్లో 12 సిక్సులు బాదిన పూరన్.. ఈ లీగ్లో ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్ల బాదిన తొలి క్రికెటర్గా రికార్డు అందుకున్నారు. ఈ మ్యాచ్లో పూరన్ చేసిన 89 పరుగులు లీగ్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2019 సీజన్లో క్రిస్లిన్ 91 పరుగులతో అజెయంగా నిలిచాడు.