ఠాకుర్ సూపర్ బౌలింగ్తో మరోసారి సూపర్ ఓవర్.. మళ్లీ భారత్దే విజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో భారత్ విజయం సాధించింది. మరోసారి సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో విజయం కోహ్లీసేననే వరించింది. 14 పరుగుల సూపర్ ఓవర్ లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఫలితంగా భారత్ సూపర్ ఓవర్లో ఓటమెరుగని జట్టుగా గుర్తింపు పొందగా.. మరో ఓటమిని న్యూజిలాండ్ మూటగట్టుకుంది.
ఇక అంతకుముందు 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చారు. ఈ సిరీస్లో వరుసగా రెండోసారి సూపర్ ఓవర్ జరగడం..రెండింటిలోనూ భారత్ గెలవడం గమనార్హం.

శార్ధుల్ ఠాకుర్ సూపర్ ఓవర్..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శార్థుల్ ఠాకుర్ అద్భుతం చేశాడు. ఆతిథ్య జట్టు విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. క్రీజులో రాస్ టేలర్(24), టీమ్ సీఫెర్ట్(54) ఉండటంతో కివీస్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ తొలి బంతికే టేలర్ను ఔట్ చేసిన ఠాకుర్ భారత శిభిరంలో ఆశలు రెకెత్తించాడు.
అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన డార్లీ మిచెల్ బౌండరీ కొట్టడంతో ఇక కివీస్ గెలిచిందిలే అనుకున్నారు. కానీ ఇక్కడే ఠాకుర్ అద్భుతం చేశాడు. మరుసటి బంతి మిచెల్ బ్యాట్కు తగలకున్నా రన్ తీసే ప్రయత్నం చేయగా.. నాన్ స్ట్రైకర్ సీఫెర్ట్ను కీపర్ రాహుల్ రనౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి క్రీజులోకి వచ్చిన సాంట్నర్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిచెల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. సాంట్నర్ డీప్ పాయింట్ మీదుగా స్వీప్ చేసి రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ మరోసారి టై అయింది.

సూపర్ ఓవర్.. మళ్లీ బుమ్రాకే
టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కెప్టెన్ కోహ్లి మరోసారి బంతిని జస్ప్రీత్ బుమ్రాకే ఇచ్చాడు. కివీస్ తరపున హాఫ్ సెంచరీల హీరోలు సీఫెర్ట్, మున్రోలు బరిలోకి దిగారు. సీఫెర్ట్ తొలి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి బౌండరీ, మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. అనంతరం భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం స్ట్రైకింగ్ తీసుకున్న మున్రో ఫోర్, సింగిల్ తీయడంతో ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి.

మరోసారి టీమ్ సౌధి..
ఇక న్యూజిలాండ్ తరఫున మరోసారి టీమ్ సౌధి బంతినందుకోగా.. 14 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు క్రీజులోకి కేఎల్ రాహుల్, కోహ్లి వచ్చారు. తొలి బంతిని, భారీ సిక్సర్గా, రెండో బంతిని బౌండరీకి తరలించి మ్యాచ్ భారత్ వైపు తిప్పిన రాహుల్.. మరుసటి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం రెండు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 2,4 పరుగులు చేయడంతో భారత్ సునాయసంగా గెలుపొందింది.

చెలరేగిన మున్రో.. సీఫెర్ట్..
ఇక 166 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రోలు ఇన్నింగ్స్ను తడబడుతూనే ఆరంభించారు. ఠాకూర్, సైనీ వేసిన తొలి రెండు ఓవర్లలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఓపెనర్లు.. బుమ్రా వేసిన మూడో ఓవర్లో అయితే మూడు పరుగులే చేసారు. ఇక సైనీ వేసిన నాలుగో ఓవర్లో మున్రో సిక్స్ బాది టచ్లోకి రాగా.. ఐదో ఓవర్లో గప్తిల్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో గప్తిల్ కీపర్ చేతికి చిక్కాడు.
మరోవైపు గప్తిల్ వికెట్ కోల్పోయినా.. మున్రో చెలరేగాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6,4,4 బాది 16 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు సిఫెర్ట్ అతనికి మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో మున్రో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దూబే వేసిన 12వ ఓవర్లో మున్రో రెండో పరుగుకు కోసం ప్రయత్నించి కోహ్లీ సూపర్ ఫీల్డింగ్కు రనౌట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో బ్రూస్ డకౌట్ కాగా.. సీఫెర్ట్, టేలర్ బాధ్యాతాయుతంగా ఆడారు. ఈ క్రమంలో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయం దిశగా నడుస్తున్న ఆ జట్టును ఠాకుర్ దెబ్బతీశాడు. చివరి ఓవర్లలో 6 పరుగులు చేసిన ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.
అంతకు ముందు మనీష్ పాండే (50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో భారత్ 165 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications