పృథ్వీషా ఇన్.. శుభ్మన్ ఔట్..
సీనియర్ ఓపెనర్ల గాయాలతో జట్టుకు దూరమవడం.. వన్డే సిరీస్లో మయాంక్-పృథ్వీషా విఫలమవడం.. సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ టెస్ట్ జట్టులో లేకపోవడంతో ఇన్నింగ్స్ ప్రారంభించే వారేవరా? అనే చర్చ తీవ్రంగా సాగింది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ మాటలను బట్టి చూస్తే మయాంక్తో జత కట్టేది పృథ్వీషానేనని స్పష్టంగా తెలుస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఈ ఇద్దరే రెండు ఇన్నింగ్స్ల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా.. రెండు ఇన్నింగ్స్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్నారు. మరో వైపు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసిన శుభ్ మన్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మరోసారి మయాంక్-పృథ్వీనే ఓపెనర్లుగా పంపించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
అనుపమా బర్త్డే.. బుమ్రా ట్వీట్.. ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్?
పంత్కు నో ఛాన్స్..
కేఎల్ రాహుల్ కీపింగ్ పుణ్యమా.. అని ఈ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని రిషభ్ పంత్.. తొలి టెస్ట్కు కూడా బెంచ్కే పరిమితం కానున్నాడు. రెగ్యూలర్ కీపర్ వృద్ధీమాన్ సాహా తుది జట్టులో ఉండనున్నాడు. టాపార్డర్లో పుజారా, కోహ్లీ రానుండగా.. మిడిలార్డర్లో రహానే, తెలుగు కుర్రాడు హనుమ విహారీ బ్యాటింగ్ చేయనున్నారు. విహారీ ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇక పేస్ బాధ్యతలను ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు పంచుకోనున్నారు. వన్డే సిరీస్లో దారుణంగా విఫలమైన బుమ్రా తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇక సొంతగడ్డపై చెలరేగిన ఇషాంత్, షమీ.. విదేశాల్లో తమ పేస్ పవర్ ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది. సీనియర్ స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్లలో ఒకరు బరిలోకి దిగనున్నారు. అశ్విన్కే చాన్స్లు ఎక్కువ ఉన్నాయి. 2014లో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆడిన భారత్ 0-1తో ఓటమిపాలైంది.
విజయాల కోసం విలియమ్సన్ సేన ఆరాటం..
ఈ సిరీస్నైన గెలిచి విజయాల ట్రాక్లో పడాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో న్యూజిలాండ్ 0-3తో క్లీన్స్వీప్ గురైంది. కానీ స్వదేశంలో పూర్తి భిన్నంగా చెలరేగే ఆ జట్టును ఏమాత్రం తక్కవ అంచనా వేయలేం. 2017 నుంచి ఆ జట్టు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ మధ్య కాలంలో ఆ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్లతో టెస్ట్ మ్యాచ్లు ఆడి గెలిచింది. ఇక ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడి జట్టుకు దూరమైన ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి రావడంతో కొండంత బలం చేకూరింది. ముఖ్యంగా స్వింగ్కు అనుకూలించే న్యూజిలాండ్ పిచ్లపై అతను కీలకం కానున్నాడు.
జెమిసన్ అరంగేట్రం..
సొంత కారణాలతో నెయిల్ వాగ్నర్ తొలి టెస్ట్కు దూరం కాగా.. అతని స్థానంలో ఇటీవల భారత్పై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆరడుగుల ఆజానుభావుడు కైల్ జెమిసన్ సంప్రదాయక క్రికెట్లో కూడా అరంగేట్రం చేయనున్నాడు. చాలా రోజుల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఆజాజ్ పటేల్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు.
వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టామ్ లాథమ్ మరోసారి కీలకం కానున్నాడు. గత ఐదేళ్లుగా టెస్ట్ ఫార్మాట్లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 11 ఇన్నింగ్స్ల్లో 62.20 సగటుతో ఒక డబుల్ సెంచరీ, ఒక శతకం, హాఫ్ సెంచరీతో 622 పరుగులు చేశాడు.
తుది జట్లు(అంచనా) :
భారత్: పృథ్వీ షా, మయాంక్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే, హనుమ విహారీ, వృద్ధీమాన్ సాహా/పంత్ (కీపర్), జడేజా/అశ్విన్, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా
న్యూజిలాండ్: టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, విలియమ్సన్(కెప్టెన్), టేలర్, హెన్రీ నికోలస్, వాట్లింగ్ (కీపర్), కొలిన్ డీ గ్రాండ్ హోమ్, టిమ్ సౌథీ, కీల్ జెమిసన్, ట్రెంట్ బౌల్ట్, ఆజాజ్ పటేల్
పిచ్, వాతావరణం
బేసిన్ రిజర్వ్ మైదానం పిచ్పై బుధవారం 15-18 మిల్లీ మీటర్ల మందం పచ్చిక కనిపించింది. మ్యాచ్ రోజు కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి పేసర్లకు బాగా అనుకూలం. పైగా ఇది ఓపెన్ గ్రౌండ్ కావడం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు స్వింగ్ను శాసిస్తాయి. బ్యాట్స్మెన్ ఆరంభ పరీక్షను అధిగమించాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ను ఎంచుకోవచ్చు. వర్షం ముప్పు లేదు.